జగిత్యాల అర్బన్, అక్టోబర్ 29: ‘జగిత్యాల నియోజకవర్గంలోని 3లక్షల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు వారికి ఆపదొస్తే అండగా ఉంటా. కష్టమొస్తే ఆదుకుంటానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 22, 37వ వార్డుల్లో తన సతీమణి రాధికతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కొత్త ఇండ్లు కట్టకుండా, ఎప్పుడో తాతల కాలం నాటి ఇండ్లను చూపెడుతూ మేమే ఇండ్లను నిర్మించి ఇచ్చామని ఆ పార్టీ నేతలు గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు.
కానీ ఇచ్చిన హామీ ప్రకారం జగిత్యాల పట్టణంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను అందజేశామన్నారు. 22,37 వార్డుల్లోని ఎంతో మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను సైతం ఇప్పించామని తెలిపారు. అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సమైక్య పాలనలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే తెలువని పరిస్థితి ఉండేదని, కానీ ఈ రెండు వార్డుల్లో ఎంతో మంది బాధితులకు వైద్యఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించామని చెప్పారు.
అధ్వానంగా మారిన జగిత్యాల బైపాస్ రోడ్డును అభివృద్ధి చేశామని, కృష్ణానగర్, అరంద్నగర్లో కొత్త పైపులైన్ వేసి నీటి ఎద్దడిని నివారించామని గుర్తు చేశారు. వార్డుల్లోని ప్రజలకు, యువతకు సేవాగుణం, ఆధ్యాత్మిక భావన ఎక్కువ అని, దీనిని గుర్తించే వార్డుల పరిధిలోని ఆలయాలకు ఇప్పటివరకు రూ.1.20 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రైతులకు రైతుబీమా వర్తింపజేస్తున్నట్లే, మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి పేద వారికి కేసీఆర్ బీమా పేరుతో రూ.5లక్షల బీమా చేస్తామని, పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. మోతె చెరువు కట్ట వద్ద పెద్ద మురుగు కాలవను నిర్మించామని, బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా మెట్లను సైతం కట్టించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
22,37 వార్డుల్లో ఇంటింటా ప్రచారం సందర్భంగా 22వ వార్డుకు చెందిన వీరబత్తిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్కు చెందిన వంద మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, నాయకులు వీరబత్తిని శ్రీనివాస్, జితేందర్, మహేందర్, ఆడెపు సత్యం, అజీజ్, సుభాష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.