జగిత్యాల రూరల్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేపర్ బాయ్ ప్రకాశ్ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ శనివారం కలిశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్తో రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పేపర్బాయ్ ప్రకాశ్ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ను బాగా చదువుకోవాలని సూచించారు. అతడు చదువుతున్న ఓల్డ్ హైస్కూల్లో విద్య, మధ్యాహ్న భోజనం వంటి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకాశ్కు మంచి భవిష్యత్తు ఉందంటూ అతడి తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం ప్రకాశ్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, యూత్ అధ్యక్షుడు గిరి, నాయకులు దావ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.