మెట్పల్లిలో ప్రశాంతంగా గణేశుడికి వీడ్కోలు
మెట్పల్లి : గణపతి బొప్పా మోరియా.. అంటూ బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం పట్టణంలో మధ్యాహ్నం ప్రారంభమైన వినాయకుడి ప్రతిమల నిమజ్జనోత్సవ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. కొవిడ్-19 నిబంధనలను పరిగణలోకి తీసుకుని పలు మండపాల నిర్వాహకులు ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా నిరాడంబరంగా శోభాయాత్రగా తీసుకెళ్లి బై బై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. పట్టణంలోని వట్టివాగులో వినాయకుని విగ్రహాల ను నిమజ్జనం చేశారు. వట్టి వాగులో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విగ్రహాలను నీటిలో సులువుగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ను ఏర్పాటు చేశారు. అదే విధంగా జ్ఞానోదయ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు చెందిన 50 మంది వలంటీర్లు తమ సేవలు అందించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ గౌస్బాబా పర్యవేక్షణలో సీఐ శ్రీను, ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.