Jagtial : జగిత్యాలలో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఛాతినొప్పితో క్రిటికల్ కేర్ ఆస్పత్రికి వెళ్లిన కరీంనగర్కు చెందిన చక్రవర్తి(38)కి వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహించారు. ఈసీజీ నార్మల్గా రావడంతో అతడిని ఇంటికి వెళ్లాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈసీజీ అనంతరం ఆస్పత్రి నుంచి కొంత దూరం వెళ్లి.. ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తుండగా చక్రవర్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో కుప్పకూలిన చక్రవర్తిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
చక్రవర్తి హఠాన్మరనంతో మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చక్రవర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చాతి నొప్పితో ఆస్పత్రికి వచ్చిన సమయంలోనే చేర్చుకుని.. చికిత్స అందించి ఉంటే అతడు ప్రాణాలతో ఉండేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైద్యులు స్పందించాల్సి ఉంది.