కలెక్టర్ జీ రవి
హరితహారం , పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమావేశం
జగిత్యాల, జూన్ 28: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యం నుంచి సంబంధిత అధికారులతో 7వ విడుత హరితహారం, 4వ విడత పల్లె ప్రగతి, 3వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, విద్యుత్, ఆర్బీ, ఇంజినీరింగ్, మిషన్ భగీరథ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా ఏర్పడి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కార్యాచరణ రూపొందించుకొని జూలై 1నుంచి పది రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
పది రోజుల్లో ప్రతి రోజూ చేసే కార్యక్రమాల వివరాలను ఈ-పోర్టల్లో పంచాయతీ సెక్రటరీలు విధిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేయడం, శిథిలావస్థలో, ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలు, గోడలను గుర్తించి తొలగించాలని, టా యిలెట్స్ క్లీనింగ్, పాత బావులు, బోర్బావులను మూసివేయాలని, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడడంతోపాటు, చెత్తను వేసిన వారికి నోటీసులు జారీ చేసి వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చు డిమాండ్ నోటీసులు జారీ చేసి వారి నుంచే వసూలు చేయాలన్నారు. పైప్లైన్ల లీకేజీలు లేకుండా చూడాలని, వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతోపాటు వాటర్ క్లోరినేషన్ చేయాలని సూచించారు. వైకుంఠధామాలు, డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేయడంతో పాటు రసీదులు తీసుకొని మొక్కల సంరక్షణకు వారిని బాధ్యులను చేయాలన్నారు. ప్రతి మండలంలో పదెకరాలకు తగ్గకుండా స్థలాన్ని గుర్తించి దానికి హద్దులను ఏర్పాటు చేసి బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రధాన, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా మల్టీ లెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో పవర్ డే కార్యక్రమం నిర్వహించి ఇళ్లపై నుంచి వెళ్లే విద్యుత్ తీగలను సవరించాలని, చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తగలకుండా చూడాలని, అవసరం లేని విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో వినోద్, డీపీవో నరేశ్, ఈఈ పీఆర్ రెహమాన్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్పీవోలు, తదితరులు పాల్గొన్నారు.