సీఎం కేసీఆర్ కృషితో పెరిగిన అటవీ విస్తీర్ణం
భావితరాలకు ఎంతో మేలు
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో కరీంనగర్ పోలీసుల సేవలు భేష్
వెదురుగట్ట కేసీఆర్ వనం.. వెలిచాల నందనవనం సూపర్
కొదురుపాక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్
ఉమ్మడి జిల్లాలో విస్తృత పర్యటన
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు హాజరు
చొప్పదండి/బోయినపల్లి/కొత్తపల్లి/రాంనగర్/గోదావరిఖని జూలై 24 : ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితహారం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని, తెలంగాణ పచ్చలహారమైందని చెప్పారు. శనివారం మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని, ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయా చోట్ల మొక్కలు నాటి మాట్లాడారు.
రేపటి తరాల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో 23 వాతం ఉన్న అడవులు 27శాతానికి పెరిగాయని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. మంత్రి కేటీఆర్కు బర్త్డే సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. ఆయాచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు చందర్, దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి పాల్గొన్నారు. గోదావరిఖనిలోని ఆర్జీ-2 ఏరియాలోని అబ్దుల్ కలాం క్రీడా మైదానం, ఇల్లందు గెస్ట్హౌస్, పోలీస్ గెస్ట్హౌస్, ఆర్జీ-3లోని అడ్రియాల పోచమ్మ గుడి వద్ద, సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ ఆలయంలో మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్రావుతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
చొప్పదండి మండలం వెదురుగట్ట ఫారెస్ట్ ఏరియా కేసీఆర్ వనం వద్ద, కొత్తపల్లి మండలం చింతకుంటలోని డబుల్ బెడ్రూం కాలనీలో మొక్కలు నాటారు. చింతకుంట బుల్సెమన్ సెంటర్ను సందర్శించారు. అనంతరం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. మియావాకీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన చిట్టడవులను పరిశీలించారు. కాగా, సంతోష్కుమార్కు సీపీ కమలాసన్రెడ్డి సాదరంగా ఆహ్వానించి శిక్షణ కేంద్రంలోని అడవులపై తీసిన ఛాయా చిత్రాల ఎగ్జిబిషన్ను వివరించారు. అనంతరం ఎంపీ సంతోష్ శిక్షణ కేంద్రంలో మొక్క నాటారు. రామడుగు మండలం వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన ఏర్పాటు చేసిన నందనవనాన్ని సందర్శించారు. పట్టణాలకు ధీటుగా ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. చివరగా బోయినపల్లి మండలంలోని తన స్వగ్రామం కొదురుపాకలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం కేవలం ఒక్క తెలంగాణ మాత్రమేనని పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో కోటి వృక్షార్చన చేపట్టి 1.75కోట్ల మొక్కలు నాటామని, దాని స్ఫూర్తిగా యువ నాయకుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడుకోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంతో ముక్కోటి వృక్షార్చన తలపెట్టి దానిని చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
కరీంనగర్ పోలీసుల సేవలు అమూల్యం
ప్రకృతి పర్యావరణ చర్యల్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల సేవలు భేష్ అని సంతోష్కుమార్ కితాబిచ్చారు. సీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రం (సీటీసీ)లో కొనసాగుతున్న చిట్టడవులు, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్న ప్రాజెక్టులను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మియావాకి ప్రాజెక్ట్-1, ప్రాజెక్ట్-2, చేపల చెరువు, రాక్ గార్డెన్ గ్రామీ ణ వాతావరణాన్ని తలపించే రీతిలో పేయింటింగ్లు హరితవనం, చిట్టడవుల ప్రాంతాల్లో ఏర్పా ట్లు చేయడం, అసాధారణ విషయమన్నారు.
కొదురుపాకను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతాం
బోయినపల్లి మండలంలోని తన స్వగ్రామం కొదుపాక గ్రామంలో ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్ పర్యటించారు. కొదురుపాక ఆర్అండ్ కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తులను పేరుపేరునా పలుకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కోరారు. కొదురుపాక గ్రామాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు.
కేసీఆర్ వనం మహా అద్భుతం
చొప్పదండి మండలం వెదురుగట్ట ఫారెస్ట్ ఏరి యాలోని కేసీఆర్వనం మహాఅద్భుతంగా ఉందని సంతోష్కుమార్ ప్రశంసించారు. శనివారం వెదురుగట్టను ఆయన సందర్శించారు. మొదటిసారి చొప్పదండికి వచ్చిన సంతోష్కుమార్కు ఎమ్మెల్యే సుంకె ఘన స్వాగతం పలికి వెదురుగట్ట దాకా పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. వె దురుగట్టలో కేసీఆర్ వనం సైన్బోర్డును సంతోష్కుమార్ ఆవిష్కరించారు. వనంలో గతేడాది మం త్రి కేటీఆర్ నాటిన మొక్కను పరిశీలించి, మాట్లాడారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా చొప్పదండి మండలంలో వేలసంఖ్యలో మొక్కలు నాట డం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. వెదరుగట్టలో కేసీఆర్ వననిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే రవిశంకర్ను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ కేటీఆర్ బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలను నాటామన్నారు. ఇందుకు కృషిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.