వైరస్ నివారణపై చర్యలు తీసుకోవాలి lరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
లాక్డౌన్, కొవిడ్ నివారణ చర్యలు, శానిటేషన్ నిర్వహణపై సమీక్ష
జగిత్యాల(నమస్తే తెలంగాణ), మే 24: కరోనాను జయించేలా బాధితులకు ధైర్యం చెప్పాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. లాక్డౌన్ నిర్వహణ, కొవిడ్ నివారణ చర్యలు, శానిటేషన్ నిర్వహణపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం జూమ్ యాప్ ద్వారా కలెక్టర్, వైద్య, ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత ఫీవర్ సర్వే ద్వారా కొవిడ్ ప్రభావాన్ని అనూహ్యంగా తగ్గించగలిగారన్నారు. ఫీవర్ సర్వే సత్ఫలితాలు ఇస్తున్నందున రెండో విడత సర్వే మరింత పకడ్బందీగా చేపట్టాలని, అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములై కరోనా నిర్ధారణ అయిన వారిని ఇండ్లలోనే ఐసొలేషన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని, కరోనాను జయించేలా ధైర్యం చెప్పాలని సూచించారు. కరోనాకు ప్రభుత్వ దవాఖానల ద్వారా మెరుగైన వైద్యం అందుతుందనే భరోసాను ప్రజల్లో కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సరిపడా ఐసొలేషన్ కేంద్రాలు, ఆక్సిజన్, రెమ్డెసివిర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొవిడ్ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొవాలనే ఉద్దేశ్యంతో చికిత్స కోసం రెండు ప్రభుత్వ దవాఖానలతోపాటు 25 ప్రైవేట్ దవాఖానలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, జిల్లాలో 535 బెడ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కొవిడ్ చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. కరోనా సమయంలో సిటీ స్కాన్, ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించి ఫీజులు నియంత్రించాలని సూచించారు. రెండో సారి లాక్ డౌన్ అమలైన తర్వాత కొవిడ్ పరిణామాలను, ఫలితాలను తెలుసుకోవాలని చెప్పారు. పది గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొవిడ్తో పాటు డెంగ్యూ ఫీవర్ కూడా వస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి గ్రామ స్థాయి దాకా పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో నిర్వహించిన పల్లె ప్రగతితో గ్రామాల్లో సత్ఫలితాలు వచ్చాయని, పారిశుధ్యంపై అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా దవాఖాన నిర్వహణపై దృష్టి సారించాలని, ఐసొలేషన్ నిర్వహణ బా గున్నప్పటికీ మెడికల్ కిట్, భోజనం, డాక్డర్ల పర్యవేక్షణపై అధికారులు పర్యవేక్షించాలన్నారు. 108 అంబులెన్స్లు లేని మండలాల్లో అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ కంట్రోల్కు చర్యలు తీసుకుంటున్నామని, ఫీవర్ సర్వేలో 8300 మంది లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేశామని వివరించారు. బుధవారంలోగా రెండో విడత ఫీవర్ సర్వేను పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. సర్వే ద్వారా పాజిటివ్ వ్య క్తుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఐసొలేషన్ ద్వారా వ్యాధిని నివారించగలుగుతున్నామన్నారు.
కొవిడ్ చికిత్స అందించే దవాఖానల్లో బెడ్ల ఖాళీల వివరాలను ప్రతి నిత్యం అందుబాటులో ఉంచుతున్నామని, కొవిడ్ దవాఖానల్లో సైతం ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 135 సిలిండర్లను దవాఖానలకు అందచేశామని, ఆక్సిజన్ వినియోగాన్ని ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు దవాఖానలు వసూలు చేసే ఫీజులపై దృష్టి సారించామని, సక్రమంగా చికిత్స అందించని మూడు హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. లాక్డౌన్తో పాజిటివ్ కేసుల సంఖ్య 34శాతం నుంచి 14శాతానికి పడిపోయిందన్నారు. సిటీ స్కాన్కు రూ.2వేల నుంచి రూ.2500 తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవోలు మాధురి, వినోద్కుమార్, వైద్యాధికారి డా.శ్రీధర్ జగిత్యాల, మెట్పెల్లి దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రత్యేకాధికారులు ఉన్నారు.