సీఎం కేసీఆర్కు లేఖ రాసిన మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి
అందరికీ అందుబాటులో ఉంటుందని విన్నపం
జగిత్యాల అర్బన్, జూలై 19: జిల్లాకు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పట్టణంలోని ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి సీఎం కేసీఆర్కు సోమవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, పట్టణంలోని కొత్త బస్టాండ్కు దగ్గరగా ఉన్న ధరూర్ క్యాంపులో వంద పడకల మాతా శిశుకేంద్రం, డయాగ్నోస్టిక్ సముదాయాలు కూడా ఉన్నందున ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేస్తే మెడికల్ హబ్గా మారుతుందని వివరించారు. హాస్పిటల్కు వచ్చే వారికి రవాణా ఖర్చులు సైతం తగ్గుతాయని, 1.20 లక్షల జనాభా ఉన్న జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి నిత్యం 20-30వేల మంది పట్టణానికి వస్తూ పోతూ ఉంటారన్నారు. బస్టాండ్కు దగ్గరగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తే ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు ఉండవని సూచించారు. జగిత్యాల నియోజకవర్గానికే కాకుండా కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ నియోజక వర్గాల ప్రజానీకానికి సైతం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాజకీయ లబ్ధికోసమే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మెడికల్ కాలేజీని చల్గల్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారని, ఇప్పటివరకు ఆయన ఎన్నో పదవుల్లో అనుభవించినప్పటికీ చల్గల్ వ్యవసాయ క్షేత్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని, ఈ విషయం ప్రజలకు సైతం తెలుసని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం చల్గల్ పండ్ల మార్కెట్ కోసం రూ.5.50 కోట్లతో పాటు అదనంగా 10ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో బ్రహ్మాండమైన వ్యవసాయ క్షేత్రంగా మారనుందన్నారు. సరైన చిత్తశుద్ధి లేకుండానే జేఎన్టీయూ కళాశాలను, న్యాక్ సెంటర్ ను పట్టణానికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీనివల్ల విద్యార్థులకు సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నొక్కిచెప్పారు. ఊరికి దూరంగా ఏర్పాటు చేస్తే ఎలాంటి వసతులు, రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ధరూర్ క్యాంపులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు బీజేపీ, ఎంఐఎం పార్టీల కౌన్సిలర్లు కూడా ఏకాభిప్రాయం తెలిపారని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు