వారంలో రెండు రోజులు డ్రైడే
సీజనల్ వ్యాధులు, కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన
డివిజన్ల వారీగా మురుగు కాలువలు శుభ్రం
కార్పొరేషన్, జూలై 15: నగరంలో సీజనల్ వ్యాధులు, కరోనా నియంత్రణకు బల్దియా పాలకవర్గ సభ్యులు, అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించారు. డివిజన్ల వారీగా చెత్త పేరుకుపోకుండా చూడడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపడుతున్నారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో గంబుషీయా చేపలు, ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. ప్రతి డివిజన్లో పారిశుధ్య ఇన్స్పెక్టర్, జవాన్లు పర్యవేక్షించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను నిరంతరం కొనసాగించాలని సిబ్బందిని ఆదేశించారు.
వారంలో రెండు రోజులు డ్రై డే
నగరంలో దోమల నివారణకు ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రెండు రోజుల్లో ప్రతి డివిజన్లో ఇండ్ల ఆవరణలోని పాత టైర్లు, డబ్బాలు, తొట్టీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతో పాటు పరిసరాల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి డివిజన్ల వారీగా ఇంజినీరింగ్, పారిశుధ్య సిబ్బందిని నియమించి పనులు చేపడుతున్నారు. ఆయా డివిజన్లలో మురుగు కాలువలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. అలాగే, కొవిడ్ జాగ్రత్తలతో పాటు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నగరంలో మరోసారి జ్వర సర్వే చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సర్వే బృందాలను ఏర్పాటు చేయగా ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకోవడంతో పాటు అవసరమైన వారికి చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. నగరంలో పూర్తిస్థాయిలో పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇండ్లల్లోని చెత్తను మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చే వాహనాల్లోనే వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.