పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి
మానవ వ్యర్థాలతో ఎరువు తయారీకి సరికొత్త ఆలోచన
ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయం
1.83 కోట్లతో కోరుట్లలో అందుబాటులోకి ప్లాంట్
తాజాగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
కోరుట్ల, జూన్ 11:పచ్చదనం.. పరిశుభ్రతకు నడుంబిగించిన రాష్ట్ర సర్కారు, పర్యావరణ రక్షణకు సంకల్పించింది. మానవ వ్యర్థాలతో ఎరువు తయారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా, కోరుట్లలో ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే పట్టణ ప్రగతి నిధులు 1.83 కోట్లతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)ను ఏర్పాటు చేయగా, ఈ నెల 8వ తేదీన మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఇటు వ్యర్థాల శుద్ధి.. అటు ఎరువుల వృద్ధితో బహుళ ప్రయోజనాలు కలుగనున్నది.
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి
స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం బాగా పెరిగింది. సెప్టిక్ ట్యాంకులు నిండితే ప్రైవేట్ ట్యాంకర్లు వచ్చి వ్యర్థాలను శివారు ప్రాంతాల్లో పారవేయడం, గుంత తీసి పూడ్చడం జరుగుతున్నది. దీంతో వాయు, నీటి, భూ కాలుష్యంతో పర్యావరణానికి విఘాతం కలిగి, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పురపాలికల్లో మానవ వ్యర్థాలను శుద్ధి చేసి సేంద్రియ ఎరువుల తయారు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి నిర్మాణ పనులతోపాటు తొమ్మిదిన్నరేళ్లు నిర్వహణ బాధ్యతలను అప్పగించగా, కోరుట్లలో ఇటీవలే ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటైంది.
పనితీరు ఇలా…
పట్టణంలోని ప్రజా, వ్యక్తిగత మరుగుదొడ్ల సెప్టిక్ ట్యాంకుల నుంచి మానవ వ్యర్థాలను సేకరిస్తారు. వీటిని ఎఫ్ఎస్టీపీ కేంద్రానికి తరలిస్తారు. ప్లాంట్లో వ్యర్థాలను కుమ్మరించిన తర్వాత మల వ్యర్థం, నీరు సెపరేట్ అవుతాయి. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చిన్న గదుల ద్వారా వివిధ దశల్లో వడపోత జరుగుతుంది. సేంద్రియ ఎరువు కార్బన్ ఫిల్టర్లోకి, శుద్ధి తర్వాత నీరు ట్యాంకులోకి చేరుతుంది. ఈక్రమంలో నీరు, ఘన పదార్థాలుగా వేరవుతాయి. ఘన పదార్థాలను శుద్ధి చేసి పొడిగా మారుస్తారు. ఇది పంట పొలాలకు ఎంతో మేలు కలిగించే ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. శుద్ధి తర్వాత నీటిని మొక్కల పెంపకానికి, కూరగాయల సాగుకు వినియోగించుకోవచ్చు.
కాలుష్య నియంత్రణకు దోహదం..
మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ కాలుష్య నియంత్రణకు ఎంతో దోహదం చేస్తుంది. గతంలో మానవ మల వ్యర్థాలను శివారు ప్రాంతాల్లో పారవేయడం ద్వారా వాయు, నీటి, పర్యావరణం కలుషితంగా మారేది. జిల్లాలోనే మొట్ట మొదటి ప్లాంట్ను ఇక్కడ నిర్మించాం. పట్టణంలో 16 వేల మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయి. మానవ వ్యర్థాలను పకడ్బందీగా శుద్ధీకరణ కేంద్రానికి తరలించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. నలుగురు సెప్టిక్ ట్యాంక్ ఓనర్లకు మున్సిపాలిటీ లైసెన్స్లను అందించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ కూడా మానవ వ్యర్థాల డంపింగ్ జరుగకుండా చర్యలు తీసుకుంటాం.
రోజుకు ఆరు క్వింటాళ్లు..
75 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన భూ ఉపరితల వాటర్ ప్లాంట్ రోజుకు 25 వేల లీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తుంది. దీని ద్వారా రోజుకు సుమారు ఆరు క్వింటాళ్ల ఎరువు తయారవుతుంది. ఎరువులను రైతులకు విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉండగా, శుద్ధి చేసిన నీటిని హరితహారం మొక్కలు, కూరగాయల సాగుకు వినియోగించుకోవచ్చు. ఆధునిక సాంకేతికను ఉపయోగించి ప్లాంట్ నిర్మాణం చేపట్టాం. లీజ్ కాలపరిమితి ప్రకారం ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు కంపెనీ చూసుకుంటుంది.