అట్లాంటి పార్టీలో ఈటల ఎట్ల చేరిండు..? ఆయననెందుకు పాపం అనాలె..?
జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం
జమ్మికుంట, ఆగస్టు 10: ‘పువ్వు గుర్తుకు దళితులంటే పడదు. మానభంగాలు చేస్తరు. దాడులు.. మర్దర్లు చేస్తరు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులకు దగా చేసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో నువ్వెట్ల చేరుతవు.. ఈటల. నీకు దళితుల ఓట్లద్దు.. ముస్లిం.. మైనార్టీలవి వద్దు.. మరెందుకు వస్తున్నావో చెప్పాలె. నీకెందుకు ఓటెయ్యాలో చెప్పాలే…? దళిత బంధుపై విమర్శలు చేస్తరా..? మా ప్రభుత్వం రూ.10లక్షలిస్తున్నం. మీరు మరో రూ.20 ఇయ్యండి. దళితులను ఆదుకోండి. ఇది చేతకాదు. రెండు సార్ల మంత్రిగ జేస్తివి. అభివృద్ధి చేయకపోతివి. ప్రజలను గాలికొదిలేస్తివి. వందల ఎకరాలు.. వేల కోట్లు సంపాదించుకున్నడు. మనకేమన్నా ఇస్సా ఇస్తడా ఏంది..? ప్రజలు గమనించాలి. ప్రభుత్వ పథకాలను చూడాలి. అభివృద్ధి, సంక్షేమం అందించిన పార్టీకే పట్టం గట్టాలె..’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట, కేశవపురం, ధర్మా రం వార్డుల్లోని దళిత కాలనీల్లో పర్యటించారు.
కాలనీలన్నీ కలియతిరిగారు. కాలనీవాసులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆబాది శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆయా వార్డుల్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈటలకు ఏం అన్యాయం జరిగిందని పార్టీని వదిలిపెట్టాడో.. చెప్పమంటే చెప్పడని, కానీ అన్యాయం జరిగిందని, ఆత్మ గౌరవమంటూ మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. పార్టీలో ఆయనకు మాత్రమే న్యా యం జరిగిందనీ, పార్టీలో పదవులన్నీ అనుభవించిన ఏకైక వ్యక్తి రాజేందరేనని పేర్కొన్నారు. ఎస్సీలు, బీసీల ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను కొన్నాడని, ఫిర్యాదు చేసిన బాధితుల పక్షాన ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే పార్టీని వీడాడని చెప్పారు.
బీజేపీలో ఎందుకు కలిశాడో చెప్పాలని డి మాండ్ చేశారు. ఏడేళ్ల కాలంలో బీజేపీ ప్ర భుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పాలన్నారు. పైగా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని సీఎం ప్రవేశపెడితే నాయకులు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు వారి ఖాతాల్లో వేస్తారని, ఇది ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే మా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షలతో పాటూ మీరు రూ.20లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంపై అనుమానాలు వద్దని, రాష్ట్రమంతటా పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎవరున్నా.. లేకున్నా.. ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కేశవపు రం, ధర్మారం, ఆబాదికి సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్ నిర్మా ణం చేపిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రా వు, ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు, కాలనీవాసులున్నారు.