జిల్లాలో రెండు ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు
సర్దాపూర్లో 38, వేములవాడలో 160 బెడ్లు సిద్ధం
స్వల్ప లక్షణాలు ఉన్న వారికి తాత్కాలిక వసతి
14రోజుల పాటు సేవలు
ఉచితంగా వసతి, భోజనం,వైద్య సదుపాయాలు
సిరిసిల్ల టౌన్, మే 3: కరోనా సోకితే ఎక్కడ ఉండాలో తెలియక సతమవుతున్న పేదలకు ప్రభుత్వం భరోసానిస్తున్నది. వారు నివసించే పరిసర ప్రాంతాల్లో వైద్యం పొందేలా ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్, వేములవాడలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చి స్వల్ప లక్షణాలు ఉన్నవారి కోసం ఈ కేంద్రాలను వినియోగిస్తున్నది. అద్దె ఇంట్లో ఉండేవారు, ప్రైవేట్ ఐసొలేషన్కు వెళ్లేందుకు స్థోమత లేని వారికి ఇవి శ్రీరామరక్షలా నిలుస్తున్నాయి.
పేదలకు తాత్కాలిక వసతి
ప్రస్తుతం కరోనా వచ్చిన వారిలో కొందరు హోమ్ ఐసొలేషన్లో ఉంటుండగా, మరికొందరు ప్రభుత్వ, ప్రైవేట్ ఐసొలేషన్ ఉండి చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రైవేట్కు వెళ్లే స్థోమత లేక, అద్దె ఇండ్లలోని ఇరుకు గదుల్లో హోమ్ ఐసొలేషన్లో ఉండే అవకాశం లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి వారి కోసం అందుబాటులో ఉండే విధంగా తాత్కాలిక వసతి కేంద్రాలుగా ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్దాపూర్ ఐసొలేషన్ కేంద్రంలో 38 పడకలు ఉండగా, వేములవాడలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో 160 పడకలను ఏర్పాటు చేశారు.
14 రోజులు నిశ్చితంగా ఉండేలా..
ఈ తాత్కాలిక ఐసొలేషన్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. పీహెచ్సీల్లో కొవిడ్ పరీక్షలు చేసుకున్న వారిలో పాజిటివ్గా నిర్ధారణ అయి హోమ్ ఐసొలేషన్లో ఉండే వీలులేని వారికి తాత్కాలిక వసతి కేంద్రాలుగా వీటిని వినియోగిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారిని కొవిడ్ అంబులెన్స్ల ద్వారా ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడ వారికి ఉదయం గుడ్డు, ఉప్మా, పులిహోర, పాలు, కషాయం, మధ్యాహ్నం రైస్, పప్పు, సాంబార్, గుడ్డు, రాత్రి రైస్, కర్రీ, పప్పు, సాంబార్, గుడ్డు అందిస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కిట్ విటమిన్-సి, ర్యాంటాక్, డాక్సిసైక్లిన్, పారాసిటమాల్, లివోసిట్రజిన్, బీ కాంప్లెక్స్తోపాటు సుమారు వెయ్యి రూపాయల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. మొత్తం 1,500కి పైగా పీపీఈ కిట్లు, 200 మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచారు. సర్దాపూర్ ఐసొలేషన్లో సూపర్వైజర్(1), మెడికల్ ఆఫీసర్(1), ఏడుగురు ఏఎన్ఎంలు, వేములవాడ ఐసొలేషన్లో మెడికల్ ఆఫీసర్లు(2), ఏఎన్ఎంలు(2), డాకర్లు(2) షిప్ట్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసొలేషన్లో ఉన్న వారికి సమయానికి మందులు, భోజనం అందిస్తూ సంరక్షిస్తున్నారు.
సొలేషన్తో తాత్కాలిక వసతి
జిల్లాలోని ఆయా పీహెచ్సీల పరిధిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్ వచ్చి తీవ్ర లక్షణాలు లేనివారికి పీహెచ్సీలో అందించిన మెడికల్ కిట్ను అందిస్తున్నాం. అద్దె ఇండ్లు, ఇరుకు గదుల్లో ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం సర్దాపూర్, వేములవాడలో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. సిరిసిల్లలో 38, వేములవాడలో 160 బెడ్లు ఉన్నాయి. షిఫ్టుల వారీగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సమ యానికి మందులు, ఆహారం అందిస్తూ వారికి సేవలు చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చి ఇంట్లో వసతి లేనివారు ఈ ఐసొలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలి.