NPDCL | ఎన్పీడీసీల్ అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నది. అంతేకాదు కరెంట్ బిల్లులను డిజిటల్ విధానంలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన పెంపొందిస్తున్నది. ఈ నేపథ్యంలో వినియోగదారులు సెల్ఫోన్ద్వారా ప్రతినెలా జీ పే, గూగుల్ పే, బిల్ డెస్క్, పేటీఎం, టీవ్యాలెట్ ద్వారా బిల్లులు కడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 50 శాతం మేర ఈ విధానంలో పేమేంట్స్ జరుగుతుండగా సిబ్బందికి పనిభారం దూరమైంది. అటు వినియోగదారులకు చెల్లింపుకేంద్రాల వద్ద పడిగాపులు కాసే బాధ తప్పింది.
-ముకరంపుర, మే 21
కరీంనగర్ జిల్లాలోని గృహ విద్యుత్, ఇతర కేటగిరీల వినియోగదారులు తమ నెలవారీ బిల్లులను ఎక్కువగా డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్లో పేటీఎం, బిల్ డెస్క్, టీవ్యాలెట్ వంటి అప్లికేషన్ల ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించింది. వీటితో పాటు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చెల్లించే వీలుంది. ఇందులో వి ద్యుత్ కనెక్షన్కు సంబంధించిన యూఎస్సీ నంబర్ను ఎంటర్ చేసి ఒకసారి బిల్లు చెల్లిస్తే చాలు. స దరు సర్వీసుకు సంబంధించిన బిల్లును ప్రతి నెలా రిమైండ్ రూపంలో తెలియజేస్తుంది. ఇందులో చెల్లించాల్సిన బిల్లు మొత్తంతో పాటు చివరి తేదీ వంటి వివరాలు ఉంటాయి. దీంతో వినియోగదారులు బిల్లు చెల్లింపు కేంద్రాల వద్దకు వెళ్లి గంటల తరబడి లైన్లలో నిల్చుని నిరీక్షించాల్సిన అవసరమే ఉండదు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే క్షణాల్లో హాయిగా బిల్లు చెల్లింపులను పూర్తి చేయవచ్చు. పైగా వీటి ద్వారా చేసిన చెల్లింపులు పూర్తి సురక్షితం. వెంటనే బిల్లు చెల్లించినట్లుగా వివరాలను ఆన్లైన్లోనూ నమోదవుతాయి.
డిజిటల్ చెల్లింపులు ఇలా..
కరీంనగర్ సర్కిల్ పరిధిలో హుజూరాబాద్, కరీంనగర్, కరీంనగర్ రూరల్ డివిజన్లు ఉన్నాయి. సర్కిల్ డిమాండ్ను పరిశీలిస్తే 3,98,475సర్వీసులకు గాను రూ.2,747.99 లక్షల డిమాండ్ ఉన్న ది. అయితే 1,50,277 సర్వీసుల నుంచి రూ. 1,337.69లక్షల బిల్లు మొత్తాన్ని వినియోగదారులు డిజిటల్ రూపంలో చెల్లించారు. విద్యుత్ సంస్థ గణాంకాల ప్రకారం బిల్లుల వసూళ్లలో డిజిటల్ చెల్లింపుల వాటా 50.18గా నమోదైంది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే…హుజూరాబాద్ డివిజన్లో 36.21శాతం, కరీంనగర్ డివిజన్లో 58. 35శాతం, కరీంనగర్ రూరల్ డివిజన్లో 35.57 శాతంగా ఉన్నది. జిల్లాలో డిజిటల్ రూ పంలో బి ల్లుల వసూళ్లు పెరిగినప్పటికీ, ఈ శాతాన్ని మరింత పెంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి వినియోగదారుడు ఆన్లైన్లోనే తమ బిల్లులను చెల్లించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ చెల్లింపులు సురక్షితం..
డిజిటల్ విధానంలో బిల్లుల చెల్లింపు పూర్తిగా సురక్షితం. ఎలాంటి అపోహలకు తావు లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. పతి నెలా రీడింగ్ తీసుకుని ప్రింట్ రూపంలో ఇచ్చే విద్యుత్ బిల్లుపైన టోల్ఫ్రీ నంబర్తో పాటు సంబంధిత ఏఈ సెల్నంబర్, అకౌంట్స్ ఆఫీసర్(ఏవో) నంబర్ ఉంటుంది. సేవా లోపాలను టోల్ఫ్రీ నంబర్కు, సైప్లెలో ఇబ్బందులను ఏఈ నంబర్కు ఫోన్ చేసి తెలియజేవచ్చు.
– వీ గంగాధర్, ఎస్ఈ-కరీంనగర్ సర్కిల్