కోరుట్ల, జూన్ 24: విద్యార్థుల బస్పాస్ చార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చార్జీల పెంపుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతున్నదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులపై ప్రభావం చూపుతున్నదని ఆవేదన చెందారు. చార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విన్నవించారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు నూతనంగా బస్సులు నడిపించాలని, ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చే రూట్లలో మరిన్ని బస్సులను పెంచాలన్నారు.
యాదాద్రి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కోరుట్ల, మెట్పల్లి డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. బస్ స్టాప్ల వద్ద బస్సులను ఆపాలని, మరిన్ని రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఫ్లాట్ ఫామ్లు పెంచాలని, అలాగే నూతనంగా మూత్రశాలలు నిర్మించాలన్నారు. కోరుట్ల, మెట్పల్లి ఆర్టీసీ డిపోల్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. లీజు బేసిన్లో ఉన్న మెట్పల్లి ఆర్టీసీ డిపోకు పర్మినెంట్ అలాట్మెంట్ వచ్చేలా చూడాలని ఆర్ఎం రాజు దృష్టికి తీసుకెళ్లారు. కోరుట్ల, మెట్పల్లి డిపోల్లో అద్దె ప్రాతిపదికన త్వరలోనే వందమంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తామని చెప్పారు. రెండు డిపోలకు కొత్తగా పది బస్సులు మంజూరయ్యాయని, వాటిని ఆయా డిపోలకు కేటాయిస్తామన్నారు. ఈ సమావేశంలో డీవీఏం భూపతి, కోరుట్ల డీఎం మనోహర్, ఆర్టీసీ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.