ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది. నాడు నందనవనాలను తలపించి, సమస్త జీవులకు ఆలవాలంగా మారిన అటవీ ప్రాంతం క్రమంగా విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోగా, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన హరితహారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. 2015 జూలై 3న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన హరిత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగి ఆకుపచ్చని జిల్లాగా అవతరించింది. గ్రీన్ ఫండ్ కింద నిధులు ఇస్తూ, ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేస్తూ ఎనిమిదేండ్లలో 20 కోట్లకు పైగా నాటడం, ఇంకా ఊరూరా పల్లె ప్రకృతి, బృహత్ వనాలు, కోతుల ఆకలితీర్చేందుకు మంకీఫుడ్ కోర్టులు, మియావాకీ పద్ధతిలో చిట్టడవుల పెంపకం అటవీ విస్తీర్ణాన్ని అమాంతం పెంచేసింది. నాడు 18.5 శాతం ఉన్న ఫారెస్ట్ ఏరియా నేడు 23.14 శాతానికి చేరి సమస్త జీవకోటికి బతుకునిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
కరీంనగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): అనుకోని విపత్తులు, మానవ తప్పిదాలతో చిక్కిశల్యమైన అటవీ విస్తీర్ణం, స్వరాష్ట్రంలో అమాంతం పెరిగింది. ఒకప్పుడు నందనవనాలను తలపించిన పల్లెసీమలు సైతం పెరిగిన ప్రపంచీకరణ, తరిగిన వాతావరణ స్పృహ నేపథ్యంలో తమ ఉనికిని కోల్పోయాయి. పూర్వ తరాలకు చెందినవారికి తప్ప, ప్రస్తుత తరాల వారికి పర్యావరణ ప్రాధాన్యతే పట్టని పరిస్థితులు వచ్చాయి. సాంకేతిక, శాస్త్రరంగాల్లో ఘనమైన రికార్డులను స్థాపించిన నేటితరం మానవులు. పర్యావరణ ప్రాముఖ్యతను, పచ్చదనం, గొప్పతనాన్ని మరిచిపోయారు. ఇలాంటి సమయంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని ఆకుపచ్చగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. తెలంగాణను భవిష్యత్తులో పర్యావరణ సమతుల్య ప్రాంతంగా మార్చి వేసేందుకు 2015 జూలై 3న హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భూమిపై జీవకోటి ప్రాణావాయువును పొందాలంటే, ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే 33 శాతం పచ్చదనం, అటవీ ప్రాంతం ఉండాలని భావించారు. అయితే, రాష్ట్రంలో కేవలం 21 శాతమే ఉన్నదని, దీనిని 35 శాతానికి పెంచే ఉద్దేశంతోనే హరితహారం ప్రారంభిస్తున్నట్లు ఆనాడు సీఎం ప్రకటించారు. ఇలా దాదాపు ఎనిమిదేండ్ల క్రితం ప్రారంభించిన హరితహారం జిల్లాలో విశేషమైన ప్రగతిని సాధించింది.
పచ్చదనం పెంచే క్రమంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. గ్రామాలకు, పట్టణాలకు ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధుల్లో గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా వచ్చే గ్రాంటులో 10 శాతాన్ని గ్రీన్బడ్జెట్గా ఏర్పాటు చేశారు. దీనిని పూర్తిగా పచ్చదనం కోసం మాత్రమే వ్యయం చేయాలని స్పష్టం చేశారు. దీంతో ప్రతి గ్రామానికి గ్రీన్బడ్జెట్ సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా రూ.34 కోట్లు పల్లె ప్రగతికి సంబంధించిన గ్రీన్బడ్జెట్ ఉండగా, పట్టణాల్లో రూ.37 కోట్ల పట్టణ గ్రీన్ బడ్జెట్ సమకూరుతోంది. మొత్తంగా రూ.71 కోట్ల గ్రీన్బడ్జెట్తో పల్లె ప్రకృతివనాలు, నర్సరీల నిర్వహణ చేపడుతున్నారు. గ్రీన్బడ్జెట్ నిధులతో పాటు, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సైతం విరాళాలను సేకరించి పచ్చదనం పెంపొందించేందుకు వినియోగిస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల నుంచి నెలకు రూ.500 విరాళాన్ని విధిగా తీసుకుంటున్నది. అలాగే, ఇతర ఉద్యోగులు సైతం స్వచ్చందంగా ప్రతి నెలా రూ.50 నుంచి రూ.100 దాకా హరితోత్సవానికి విరాళంగా ఇస్తుండడం గమనార్హం.
హరితహారం కార్యక్రమం జిల్లాలో పలు విజయాలు సాధించింది. 2015 నాటికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం సగటున 18.5 శాతం అటవీ విస్తీర్ణం మాత్రమే ఉండేది. పర్యావరణ పరిరక్షణలో ఇది అత్యంత అల్పస్థాయిగా, ప్రమాదకర స్థాయిగా అధికారులు గుర్తించారు. అటవీ శాతం క్రమంగా తగ్గిపోవడంతో జిల్లాలో వర్షపాతం తగ్గిపోవడంతో పాటు, జీవజాలం సైతం క్రమంగా కనుమరుగు కావడం మొదలైంది. ఈ నేపథ్యంలో 2015 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారంలో కోట్లాది మొక్కలు నాటారు. అటవీ ప్రాంతంలో చిక్కనైన అడవి కోసం అధికారులు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. వేసవికాలంలోనూ మొక్కలు, వాటితోపాటు జీవజాలం బతికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో 90కి పైగా చెక్డ్యామ్లు నిర్మించారు. అటవీ సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. అటవీ సంపదను తరలించే స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. చివరకు గ్రామాల్లో ఉన్న కర్రకోత మిషన్లను తరలించడం, కొత్తవి ఏర్పాటు చేయడంపై సైతం అనేక ఆంక్షలు విధించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగా అటవీ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటవీ విస్తీర్ణం 23.14 శాతానికి చేరుకుందని అధికారులు చెబుతున్నారు.
అది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట శివారులోని అడవి. ఈ ప్రాంతం ఒకప్పుడు రాళ్లు, రప్పల్లో ఉండేది. అధ్వానంగా కనిపించేది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అడ్వాన్స్ ఆపరేషన్లో భాగంగా ప్రభుత్వం వెదురుగట్ట శివారులోని మూడు బోట గుట్టల మధ్యన 178.4 ఎకరాల భూమిని కేటాయించింది. హరితహారం స్ఫూర్తిగా ఫారెస్టు అధికారులు ఈ ప్రాంతాన్ని మినీ ఫారెస్ట్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. లక్షలాది మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో 15 ఎకరాలు దారులు తీసి మిగిలిన 163.4 ఎకరాల్లో రావి, మర్రి, వెలగ, సీతాఫల్, ఇరికి, మామిడి, తాని, నేరుడు, దిరిసినం, బాదం, ఉసిరి, బబుల్, ఇరుమద్ది, వేప, తాప్సిన చిందుగ, నెమలినార, జిట్రేగి, సిసో, గుమ్మడి టేకు, నారేప, బట్టగనం, కానుక తదితర 23 రకాల మొక్కలు నాటారు. ప్రత్యేక చొరవ తీసుకొని మూడేళ్లలోనే అడవిని సృష్టించారు. ఏపుగా పెరిగి మొక్కలు ఇపుడు వృక్షాల్లా మారిపోయాయి. దీంతో ఇటు పచ్చదనం పెరగడమే కాకుండా వణ్యప్రాణులకు ఆవాసంగా మారింది. కోతులు, నెమళ్లు, కుందేళ్లు వంటివే కాకుండా, వేలాది పక్షులు ఈ ప్రాంతంలో గూళ్లు కట్టుకుని ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. హరితహారం స్ఫూర్తితో నిర్మించిన ఈ ఫారెస్ట్ ఇపుడు అటవీ శాఖ అధికారుల శిక్షణ నిలయంగా మారింది. తక్కువ సమయంలో ఇంత పెద్ద ఫారెస్టు ఎలా సృష్టించారనే విషయమై వివిధ జిల్లాల అటవీ శాఖ అధికారులకు అధ్యయన కేంద్రంగా మారింది. చాలా మంది ఇక్కడికి వచ్చి జిల్లా అటవీ శాఖ అధికారులు చేసిన కృషిని ప్రశంసిస్తున్నారు. మంత్రులు కేటీ రామారావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు సందర్శించి. అటవీ శాఖ అధికారుల కృషిని కొనియాడారు.
పచ్చదనం పెంపులో భాగంగా గ్రామ, పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్ను స్థానిక సంస్థలు చేపట్టాలని కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాల్లో పొందుపర్చారు. ప్రతి గ్రామం తన పొలిమేర పరిధిలో రోడ్లకు ఇరువైపులా మొక్కలను విధిగా నాటి సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధుల్లో కోత విధిస్తామని ప్రకటించడంతో ప్రతి గ్రామం ఎవెన్యూ ప్లాంటేషన్లను ఆరంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3832 కిలోమీటర్ల పొడువునా పల్లెల్లో, 514 కిలోమీటర్ల పొడవునా పట్టణ శివారుల్లో ఎవెన్యూ ప్లాంటేషన్లు వృద్దిచెందాయి.
ఒకప్పుడు జిల్లాలో దట్టమైన అడవులుండేవి. కానీ రానురాను అంతరిపోతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో హరితహారాన్ని చేపట్టారు. సీఎం పిలుపుతో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా భాగస్వామ్యమవుతున్నారు. వానలు వాపస్ రావాలే అన్న నినాదంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నాం. కాంటూరు కందకాలు తవ్వుతున్నం. జీవరాసులకు దప్పిక తీర్చేందుకు చెక్డ్యాంలు నిర్మించాం. ప్రభుత్వం చేపట్టిన హరిత హారంతో పచ్చదనం చాలా పెరిగింది. నాటికీ నేటికీ ఎంతో తేడా వచ్చింది. ఇరువైపులా నాటిన చెట్లతో రోడ్లకు పచ్చని పందిరి వేసినట్లు కనిపిస్తుంది. వాహనదారులకు నీడనిస్తున్నాయి. హరిత యజ్ఞంతో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
– వెంకటేశ్వర్రావు, జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ ఉంటుంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చూపెడుతున్న శ్రద్దతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అటవీ ప్రాంతాలు చిక్కబడుతున్నాయి. కొన్నేళ్లుగా కానరాకుండా పోయిన జీవజాలం మెల్లిగా మళ్లీ దర్శనిమిస్తున్నదని అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో చెక్డ్యామ్లు, కాంటారూ కందకాల ఏర్పాటు మంచి ఫలితాలను ఇచ్చింది. జీవరాశి వేడికి చనిపోకుండా బతికిపోవడంతో పాటు, వాటి సంతతిని పెంచుకుంటున్నాయి. అటవీ శాఖ అధికారుల అంచనాల ప్రకారం 35 శాతం జీవజాలం వృద్ది చెందిందని పేర్కొంటున్నారు. జీవజాలం సంఖ్య పెరగడంతో పాటు, వలస పక్షులు జిల్లాలో సందడి చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహరం వల్ల జిల్లాలో పచ్చదనం విషయంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపుపై ప్రతి గ్రామంలోను హరితదళాలను ఏర్పాటు చేయడం, వారి సహకారంతో పచ్చదనాన్ని పెంపొందిస్తుండడం మంచి ఫలితాలను ఇస్తోంది. జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలు సంయుక్తం చేస్తున్న కృషికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులను ఉమ్మడి జిల్లా కైవసం చేసుకుంది.
హరిత వనాలను పెంచే విషయంలో ప్రభుత్వం జిల్లాలో నూతన పద్ధతులకు నాంది పలికింది. ఒకవైపు మంకీ ఫుడ్ కోర్టులు, బృహత్ పల్లె ప్రకృతివనాలతో పాటు, అటవీ ప్రాంతాల్లో అడవులను చిక్కగా మార్చేందుకు సైతం ప్రయత్నాలు చేసింది. ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో విత్తనాలను వెదజల్లే పనిని చేపట్టింది. తొలిసారిగా సిరిసిల్ల ప్రాంతంలోని వీర్నపల్లి అటవీ ప్రాంతంలో 2020 జూన్ 25న డ్రోన్ద్వారా ఒక్కరోజే 15వేల విత్తన బంతులు వెదజల్లింది. వీర్నపెల్లితో పాటు, జగిత్యాల జిల్లా బీర్పూర్, సారంగాపూర్ లాంటి ప్రాంతాల్లోనూ ఈ పద్ధతిని పాటించారు.
జిల్లా వ్యాప్తంగా హరితహారంతో పాటు, అనేక సంస్కరణ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం ఒక్క నర్సరీ ఉండాలని, పట్టణ ప్రాంతాల్లోను వారి వార్డు సంఖ్యలకు, పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా ప్రకృతివనాలు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా 1443 పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు. ఈ వనాల్లోనే లక్షలాది మొక్కలు పెంచుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో ఏకంగా 1443 చిన్నపాటి వనాలు ఏర్పాటయ్యాయని చెప్పవచ్చు. అలాగే పట్టణాల్లోను ప్రకృతివనాలు ఏర్పాటుచేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మొక్కల పెంపక కేంద్రాలైన నర్సరీలు ఉండేవి. అయితే హరితహారం నేపథ్యంలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని, కావాల్సిన మొక్కలను అక్కడే పెంచాలనే నిబంధనలతో ఒకప్పుడు 73గా ఉన్న నర్సరీల సంఖ్య ఇప్పుడు ఏకంగా 1341కి పెరిగిపోయింది. ఇక ఈ నర్సరీల్లో ఏటా దాదాపు 1.90కోట్లకు పైగా మొక్కలు పెంచుతున్నారు. గ్రామాల్లో పల్లెప్రకృతివనాలు, నర్సరీలతో పాటు, గ్రామాల పరిధిలో ఉన్న అన్ని ఖాళీస్థలాల్లోను వనాలను పెంచే కార్యక్రమాన్ని హరితహారంలో చేపట్టారు. ఎనిమిది విడుతల్లో జరిగిన హరితహారంలో 20 కోట్లకు పైగా మొక్కలు నాటితే అందులో దాదాపు 77 శాతం మొక్కలు బతికి వృద్ధిలోకి వచ్చాయి.
ఒకప్పుడు అటవీ ప్రాంతాలు, కొండలపైన ఉన్న చెట్లపై మాత్రమే కనిపించే కోతులు కొన్నేళ్లుగా గ్రామాలు, పట్టణాలమీద పడ్డాయి. దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అటవీ ప్రాంతాలు తగ్గిపోయి, వాటికి ఆహారం దొరకని పరిస్థితి అని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే అటవీ ప్రాంతాన్ని పెంచాలని, అందులో ఆహారాన్ని ఇచ్చే పండ్ల చెట్లు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. కోతులు వాపస్ పోవాలే. వానలు వాపస్ రావాలన్నదే మన లక్ష్యం అని ఆయన ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జామ, మామిడి, సపోట, నారింజ, వెలగ తదితర పండ్ల జాతులకు చెందిన మొక్కలతో జిల్లా వ్యాప్తంగా 115 చోట్ల మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. నాలుగైదేండ్ల నుంచి ఈ ఫుడ్ కోర్టుల్లో మొక్కలు ఏపుగా పెరిగాయి. వీటితో పాటు, బృహత్ పల్లె ప్రకృతివనాలను సైతం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు.