‘చెక్ డ్యాం వద్ద ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తరా..? ఇష్టం ఉన్నట్టు అనుమతులు ఇస్తరా..?’ అంటూ లింగంపల్లి, బొల్లారం గ్రామస్తులు ఆగ్రహించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి వద్ద ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. భూగర్భ జలాలు పడిపోయి రైతులు గోస పడుతారని వాపోయారు. వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 19 : వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి చెక్డ్యాం సమీపంలోనే ఇసుక క్వారీకి ఇటీవలే అధికారులు అనుమతులు ఇవ్వగా.. గురువారం నుంచి తవ్వకాలు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చి లోడ్ చేయగా, విషయం తెలిసి బొల్లారం, లింగంపల్లి గ్రామస్తులు మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డగించి, అధికారులు పర్మిషన్ ఇవ్వడంపై ఆగ్రహించారు.
ఇప్పటికే భారీ వరదలతో చెక్డ్యాం నిండి రెండు గ్రామాల్లోకి నీళ్లు వస్తున్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. చెక్డ్యాం ఆనుకొని వాల్ నిర్మిస్తామని గతంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తోపాటు కలెక్టర్ తమకు హామీ ఇచ్చారని చెప్పారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పుడు చెక్డ్యాం వద్ద ఇసుక తీస్తే బావుల్లో భూగర్భజలాలు దెబ్బతింటాయని, రైతులు, ప్రజలు నీటి కోసం గోస పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ అబుబాకర్తో పాటు అధికారులు అక్కడికి చేరుకోగా, ఇష్టం ఉన్నట్టు ఇసుక క్వారీకి అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
వెంటనే పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తహసీల్దార్ గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత తహసీల్దార్కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇరువాల సౌజన్యమల్లికార్జున్తోపాటు బొల్లారం, లింగంపల్లి గ్రామస్తులు ఉన్నారు.