సారంగాపూర్, జూన్ 13 : రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి, సారంగాపూర్ మండలాల్లో 20 వేల ఎకరాలు సస్యశ్యామలంగా మారుతాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 0.25 టీఎంసీ నుంచి ఒక టీఎంసీకి పెంచామని, ఈ ప్రాజెక్టును ఒకసారి నింపితే రెండు పంటలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. 25 గ్రామాల పరిధిలో ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పుతాయన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టుపై ప్రతిపక్ష నాయకులు అసత్యప్రచారం మానుకోవాలని, మూడు దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు.
బీర్పూర్ మండలంలో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్ వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవుతున్న సందర్భంగా రైతులకు దీని ద్వారా ఏం ఉపయోగం ఉందో చెప్పేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ‘ఈ రోళ్లవాగు ప్రాజెక్టు అనవసరంగా కడుతున్నారు. ఇది ఎవరికి ప్రయోజనం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అనుభవమున్న వ్యక్తి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడడం చాలా బాధాకరమన్నారు.
ఈ రోళ్లవాగు ద్వారా అప్పడే 500 ఎకరాల్లో పంటలు సాగయ్యేవని తెలిపారు. ఆ తర్వాత ఎస్సారెస్పీ అధికారులు డీ53 కెనాల్ను కనెక్ట్ చేయడంతో కొంత నీటి లభ్యత పెరిగిందన్నారు. మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నవాళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. మమ్మల్ని విమర్శించే ముందు అసలు మీరేం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా జీవన్రెడ్డికి హితవు పలికారు. ఆ రోజుల్లో రోళ్లవాగు ప్రాజెక్టు గురించి ఆలోచించి ఉంటే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ఇయ్యాళ మేం ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణ చేస్తుంటే దీనిపై విష ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తాము ప్రాజెక్ట్ ప్రయోజనాన్ని ప్రజలకు వివరించేందుకు మాట్లాడుతున్నామన్నారు.
అందుకే రైతులకు పూర్తి స్థాయిలో రోళ్లవాగు ప్రాజెక్టు ప్రయోజనం వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 70 కోట్లతో చేపట్టే రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు 2017లో మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దురదృష్టం ఏమిటంటే పోయినేడాది అసలు వందేళ్లలో పడనటువంటి వర్షాలు పడ్డాయని, ఆ సమయంలో భారీ వానలతో కట్ట కొట్టుకుపోయిందన్నారు. దీనిని ఎవరం ఆపలేమమన్నారు. వెంటనే ప్రాజెక్టుకు రీ ఎస్టిమెషన్ వేయించి 136 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటి వరకు 90శాతం పనులు పూర్తయ్యాయయని, ఇది పూర్తయితే ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పుతాయన్నారు. సీఎం కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఆకాంక్షలో భాగంగా తొమ్మిదేండ్ల తర్వాత కోటి 20 లక్షల ఎకరాలు దాటి నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ధర్మపురి మండలంలోని గోదావరి ఒడ్డున 14 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందన్నారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టరు. గోదావరిలో నీళ్లు వృథాగా పోతుంటే కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. రైతులను పట్టించుకోరు’ అని కాంగ్రెస్, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుంటే కల్లాల్లో పంచాయితీలు పెట్టి ఇబ్బందులు పెడతారని విమర్శించారు. దేశంలోనే 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై జిల్లా కేంద్రంలో వారంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తామని స్పష్టం చేశారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కేడీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, ఎస్సారెస్పీ ఎస్ఈ అశోక్, నారాయణ రెడ్డి, డీఈ చక్రునాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారాపాక రమేశ్, ఉపాధ్యక్షుడు రామకిష్టు గంగాధర్, జక్కినపెల్లి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీలం రమేశ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మెరుగు రాజేశం, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ప్రాజెక్టును ఒక టీఎంసీ సామర్థ్యానికి మార్చాం
రోళ్లవాగు ప్రాజెక్టును మొదట 0.25 టీఎంసీలుగా అనుకున్నాం. కానీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక టీఎంసీకి మార్చాం. రోళ్లవాగు ఆధునీకరణ కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతగానో కృషి చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు మంజూరు చేయించారు. వాళ్లకు నా ధన్యవాదాలు. బీర్పూర్ మండలంలో దాదాపు 10 వేల కరెంట్ స్తంభాలు వేశాం. రోళ్ల వాగు ప్రాజెక్టు కోసం 200 ఎకరాలు సేకరించాలని అనుకున్నాం. సంబంధిత రైతులకు డబ్బులు కూడా ఇచ్చాం. దీన్ని కూడా కొంత మంది నాయకులు రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నారు. ఏ ప్రాజెక్ట్ అంచనాలు పెరుగలేదో ప్రతిపక్ష నాయకులు చెప్పాలి. గతంలో కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రాజెక్టులు కాట్టారో, కాలువలు ఎందుకు తవ్వారో ప్రజలందరికీ తెలుసు. వర్షాలు లేకపోతే డీ53 ద్వారా రోళ్లవాగు నింపుతాం.
– డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే