గోదావరిఖని, ఏప్రిల్ 8: రామగుండంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు, దుకాణాలు కూల్చివేస్తూ రోడ్డున పడేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. మంగళవారం గోదావరిఖనిలోని ప్రెస్క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. సోమవారం అర్ధరాత్రి పోచమ్మ మైదానంలో జరిగిన కూల్చివేతలకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ బాధ్యత వహించాలన్నారు. అధికార పార్టీ అండదండలతోనే అధికారులు అక్రమంగా కూల్చివేశారని, అర్ధరాత్రి దొంగచాటున ఎందుకు కూల్చివేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు.
పోలీసులు కాంగ్రెస్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. గతంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హయాంలో అప్పటి మేయర్ కొంకటీ లక్ష్మీనారాయణ బిల్డింగ్ల నిర్మాణాలకు అనుమతులు జారీ చేయగా, ఇప్పుడు కూల్చివేతలు సరికాదన్నారు. బాధిత చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, ఆందోళన చెందవద్దన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, గోపు ఐలయ్యయాదవ్ ఉన్నారు.