అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లా ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు అంబరాన్నంటగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు వచ్చిన ప్రముఖులు వివిధ రంగాల్లో ప్రతిభచూపిన వారికి జ్ఞాపికలు అందజేసి, సన్మానించగా, అధికారులు ఉమెన్స్ డే కానుకగా ఆయా జిల్లాలో డ్వాక్రా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు.
విద్యానగర్/ కమాన్ చౌరస్తా, మార్చి 8 : ఆడబిడ్డ మురిసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆడిపాడింది. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ కమిషనర్ శ్వేతా మహంతితోపాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. మంత్రి గంగుల కమలాకర్ వీరికి చీరెలు బహూకరించారు.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వేలాదిగా మహిళలు, ప్రజాప్రతినిధులతో కలిసి తీసిన ర్యాలీలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలోనూ వేడుకలు ఘనంగా ని ర్వహించారు. చల్గల్ గ్రామ మ్యాంగో మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ యాస్మిన్ భాష పాల్గొని, మహిళా అధికారులు, ప్రజాప్రతినిధుల ను శాలువాతో సత్కరించారు.
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే దాసరి, సీపీ రెమా రాజేశ్వరి హజరై వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సన్మానించారు. గోదావరిఖనిలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న పలువురు మహిళలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ‘మహిళ సేవా రత్న’ బిరుదులను అందించారు. మంథనిలోని రాజగృహలో జడ్పీచైర్మన్ పుట్ట మ ధూకర్, మున్సిపల్ చైర్పర్సన్ శైలజ మహిళలను సన్మానించి స్వీట్లు తినిపించారు.
మహిళా సంఘాలకు రుణాలు
మహిళాదినోత్సవ కానుకగా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాల చెక్కులను ప్రజాప్రతినిధులు అందజేశారు. కరీంనగర్ మార్క్ఫెడ్లో నిర్వహించిన వేడుకల్లో కోట్లాది రూపాయల విలువైన చెక్కులను మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్తో కలిసి అందజేశారు. పెద్దపల్లిలో 16కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మమత కలిసి అందించారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామ మ్యాంగో మార్కెట్ యార్డులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి మహిళా సంఘాలకు 10 కోట్ల రుణాల ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.