
ధర్మారం, ఆగస్టు 28: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీమణులు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై అక్షింతలు వేసి దీవించారు. సోదరులు పెట్టిన కట్న కానుకలను సోదరీమణులు స్వీకరించి ఆనందోత్సవాలతో ఈ వేడుకలను జరుపుకున్నారు. కాగా రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వగృహంలో ఆయనకు ధర్మారం మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించారు. అలాగే నంది ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డికి మాజీ మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత కూడా రాఖీ కట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాంపల్లి అపర్ణ తో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని పార్టీ మహిళ నాయకురాళ్లు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ వారికి కట్న కానుకలు సమర్పించారు.