కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వడంలో మిల్లర్ల మాయాజాలంపై యంత్రాంగం కొరఢా ఝులిపిస్తున్నది. ఇలానే, మంథని మండలంలోని వెంకటసాయి, మారుతి మిల్లులపై దాదాపు నెల క్రితం కేసులు నమోదు చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత చర్యలు ఆలస్యమవుతుండడం తప్పడు సంకేతాలనిస్తున్నది. గతంలో ఇలాంటి సమయంలోనే కొందరు రెవెన్యూ రికవరీ చట్టం నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కారనే విమర్శలున్నాయి. అప్పుడు తమ పేరు మీద ఉన్న ఆస్తులను గుట్టుగా ఇతరుల పేరు మీదకు మార్చి కాపాడుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, అక్రమాలకు పాల్పడిన వారంతా భవిష్యత్తులో ఇదేబాటలో నడిచే ప్రమాదం కనిపిస్తుండగా.. అధికారులు వెనువెంటే చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపల్లి, మార్చి 25(నమస్తే తెలంగాణ): రైతుకు మద్దతు ధర ఇస్తూ ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొంటున్నది. సదరు ధాన్యాన్ని పైసా పెట్టుబడి లేకుండా కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరిట మిల్లర్లకు అందిస్తున్నది. రా రైస్ మిల్లర్లు అయితే క్వింటాల్ ధాన్యానికి 67 కిలోలు, అదే బాయిల్డ్ మిల్లర్లయితే 68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. సీఎంఆర్ తీసుకున్నాక మూడు నెలల్లో బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అప్పగించాలి. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని వానకాలం వరకు, వానకాలంలో వచ్చిన ధాన్యాన్ని యాసంగి వరకు బియ్యంగా మార్చి ఇవ్వాలి.
కానీ, తిరిగి బియ్యం ఇవ్వడంలో చాలా వరకు మిల్లర్ల మాయాజాలం కనిపిస్తున్నది. 2022-23 యాసంగికి సంబంధించి పెద్దపల్లి జిల్లాలో 43 శాతం మాత్రమే సీఎంఆర్ పూ ర్తి కాగా, 2023-24 వానకాలంలో అయితే, కేవలం 2 శాతమే పూర్తి కావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. పదే పదే గడువు పొడిగిస్తున్నా.. బియ్యం ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది.
చర్యలు లేకపోవడంతో కొంతమంది అక్రమాలకు తెరలేపి, ప్రభుత్వం ఇచ్చిన వడ్లకే ఎసరు పెట్టి రూ.కోట్లు దండుకున్నట్లు తెలుస్తున్నది. బియ్యం కంటే ధాన్యం అమ్మితేనే ఎక్కువ అక్రమార్జన వస్తుందని భావించి ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు అక్రమంగా ధాన్యాన్ని తరలించి విక్రయించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు అధికారుల తనిఖీల్లో బహిర్గతమైంది.
ఎఫ్సీఐకి బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై అధికారులు కొరడా ఝులిపించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2022-23 వానకాలం సీజన్కు మంథని మండలం కూచిరాజ్పల్లిలోని వెంకటసాయి రైస్మిల్లు 8.50 కోట్లు, మారుతి ఇండస్ట్రీస్ రైస్మిల్లు 21.64 కోట్ల విలువైన ధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించినట్టు గుర్తించారు. గత నెల 29న కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశాల మేరకు మంథని ఠాణాలో కేసులు నమోదు చేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసి వేలం వేసి ప్రభుత్వ నష్టాన్ని భర్తీ చేస్తామని అప్పడు అధికారులు స్పష్టం చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో సుల్తానాబాద్ మండలంలోని చీకురాయిలోని ఓ రైస్ మిల్లుపై క్రిమినల్ కేసులు నమోదైనా.. అప్పుడు విచారణ అంతంత మాత్రంగానే సాగిందన్న విమర్శలున్నాయి.
అడ్డదారులు తొక్కుతున్న మిల్లర్లపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వెనువెంటే చర్యలు లేకపోవడం మిల్లర్లకు కలిసివస్తున్నది. కొన్నిసార్లు విచారణ ఆలస్యంగా జరుగుతుండగా, రెవెన్యూ రికవరీ చట్టానికి దొరక్కుండా ఉండేందుకు అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో నిందితులు తమ పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేయకుండా ఉండేందుకు గుట్టుగా బంధువుల పేరు మీదకు మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలానే, గతంలో మంథని మండలంలోని ఓ రైస్ మిల్లర్పై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నించగా, అప్పుడు ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుపైకి మార్చినట్లు తెలిసింది. దీంతో రికవరీ సాధ్యపడలేదు.
25 రోజుల క్రితం కేసులు నమోదైన వెంకటసాయి, మారుతి ఇండస్ట్రీస్ రైస్మిల్లులకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు చర్యలు లేకపోగా, వారి ఆస్తుల విలువ బకాయిపడ్డ సీఎంఆర్కు చాలా తక్కువ ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ రికవరీ చట్టాన్ని ప్రయోగించినా ప్రభుత్వానికే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో బకాయిలు ఎలా రికవరీ చేస్తారనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతున్నది.
దీనిపై మిల్లర్లలో జోరుగా చర్చ సాగుతుండగా.. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించే అక్రమార్కులపై చర్యలు ఆలస్యమైనా.. లేకపోయినా భవిష్యత్తులో మరికొంత మంది ఇదే దారిలో పయనించే ప్రమాదం ఉన్నది. కేసులు నమోదు చేయడమే కాదు.. వేగంగా చర్యలు తీసుకుంటేనే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ సొమ్మును అక్రమంగా ఎవరు కాజేసినా బాధ్యులపై చర్యలు తప్పవు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన సీఎంఆర్ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో ఏ మిల్లర్ కూడా ఇలా మోసం చేయకుండా చర్యలు తీసుకోనున్నాం. ఇప్పటికే సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాం. వారి ఆస్తుల వెరిఫికేషన్ జరుగుతున్నది.
పూర్తి స్థాయి చర్యలకు రెండు నెలల సమయం పట్టవచ్చు. ఈ విషయమై రామగుండం పోలీసు కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడాం. ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. రైస్ మిల్లర్లు మోసం చేయకుండా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరక్కుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
– ముజామ్మిల్ఖాన్, పెద్దపల్లి కలెక్టర్