మెట్పల్లి రూరల్, ఫిబ్రవరి 27: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తూ పెద్దపీట వేసిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. బంజారాల కులదైవమైన సంత్శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంత్యుత్సవాలు సోమవారం మెట్పల్లి మండల పరిషత్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా మహిళలు, యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేసిన ఎమ్మెల్యే.. ప్రత్యేక బోగ్, భండార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆరాధ్యుడేనన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల సంప్రదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవిస్తారని తెలిపారు. ఇందులో భాగంగానే గిరిజనుల కులదైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రూ. 24 కోట్లతో ప్రతిష్టాత్మకంగా గిరిజనుల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించారని కొనియాడారు. మెడికో ప్రీతి అకాల మరణానికి చింతిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, కాటిపెల్లి సరోజన, మల్లాపూర్ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఆర్టీవో శ్యామ్నాయక్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు, బంజారా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్నాయక్, ఉత్సవ కమిటీ సభ్యులు భూక్యా గోవింద్ నాయక్, జరుపుల రాయల్, నునావత్ రాజు, జరుపుల గోవింద్, గుగ్లావత్ శివలాల్, జరుపుల వసంత్, రాజేందర్, భీంరాజ్, భూమానాయక్, రమేశ్, గంగాధర్ పాల్గొన్నారు.