ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 19 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టినట్లు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. అందులో భాగంగానే మంగళవారం ఉదయం 7 గంటలకు ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్ వరకు పాదయాత్ర చేశారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ప్రజలను కంటిరెప్పలా కాపాడుకుంటానని, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు సాధ్యమైనంత త్వరగా కృషి చేస్తానన్నారు. యువత మంచి మార్గంలో వెళ్లాలని, సోషల్ మీడియాకు ఆకర్షితులు కాకుండా ఉండాలని సూచించారు. అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యేను పలువురు నాయకులు, మండల స్థాయి అధికారులు పుస్తకాలు, పెన్నులను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేమూరి లత, వైస్ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు తిమ్మని రాములు, చిన్నారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బద్దం గోపి, వైస్ చైర్మన్ జిల్లాల పవన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.