కొత్తపల్లి, జూన్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, స్వరాష్ట్రంలోనే ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్ అధ్యక్షతన నిర్వహించిన సుపరిపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లిలో జరిగిన అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్తపల్లి మండలం కాక ముందు ఎలా ఉండేది?, మండలం ఏర్పడిన తర్వాత ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ధామాలు, హరితహారం, ఇతర అభివృద్ధి పనులపై కూలంకశంగా చర్చించారు.
స్వయం పాలనలో తీసుకున్న చర్యలతో కొత్తపల్లి మండలం ఇప్పటి వరకు రెండు సార్లు ఉత్తమ మండలంగా అవార్డులు అందుకుందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకున్నదని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సమృద్ధిగా నిధులు, విధులు ఇవ్వడంతో అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని చెప్పారు. గ్రామాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జమీలుద్దీన్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.