జగిత్యాల : జిల్లాలోని మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు ( Life imprisonment ) శిక్ష పడిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ( SP Ashok Kumar ) వెల్లడించారు. నిందితులు లోకిని రాజేష్, దారంగుల సాయి కుమార్, మొగిలిపాక అనిల్ కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేష్ ఈ ఐదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నిందితులపై ఐపీసీ చట్టం కింద మెట్పల్లి( Metpally) పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని వివరించారు.
డీఎస్పీలు గౌస్ బాబా, రవీంధ్ర రెడ్డి కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితుల పై పటిష్టమైన ఆధారాలతో ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారని తెలిపారు. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు సమర్థవంతంగా వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టారని తెలిపారు.
కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు తో పాటు , ఒక్కొక్కరికి రూ 20వేల జరిమానా విధించారని పేర్కొన్నారు. మైనర్ బాలికకు రూ. 12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారని వెల్లడించారు .
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలు , విద్యార్థినులు తమపై జరిగే వేధింపులు, అన్యాయాల గురించి నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.