కాంగ్రెస్ కుట్రలపై రైతులోకం ఉద్యమించింది.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతువేదికల సాక్షిగా గర్జించింది.. సోమవారం ఏర్పాటు చేసిన రైతు సమావేశాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చి, హస్తం పార్టీ దుర్నీతిని ఎండగట్టింది. ‘కాంగ్రెస్ కటిక చీకట్ల కాలం వద్దు. 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే ముద్దు.’ ‘మూడు గంటలు నశించాలి.. మూడు పంటల వర్ధిల్లాలి’ అంటూ ముక్తకంఠంతో నినదించింది. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహించి, రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేసింది. కాగా, ఆయా చోట్ల జరిగిన సభల్లో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, కోరుకంటి చందర్ రైతులతో కలిసి పాల్గొని, కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. రైతులను అరిగోస పెట్టిన ఆ పార్టీని భూస్థాపితం చేయాలని, వ్యవసాయానికి మేలు చేస్తున్న కేసీఆర్ సర్కారుకు అండగా నిలువాలని రైతులకు పిలుపునిచ్చారు.
వీణవంక/ ఇల్లందకుంట, జూలై 17 :‘రైతులకు మూడు గంటల కరెంటు చాలు’ అని మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం భగ్గుమన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మే రకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల రైతు వేదికల్లో సభలు ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు దశాబ్దాల పాటు రైతులను రాచిరంపాన పెట్టిందని, కరెంటు కోతలతో రైతుల ఆత్మహత్యలకు కారణమైందని మండిపడింది. మళ్లీ మూడు గంటలు చాలంటూ రైతులను అవమాన పరుస్తున్నారంటూ ధ్వజమెత్తింది. రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్మానాలు చేసి మండల రైతు బంధు సమితి కమిటీలకు పంపించింది.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమన్పల్లి రైతువేదికలో జరిగిన సభకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. ముందుగా అంతర్గాం ఎంపీడీవో కార్యాలయ నుంచి సోమన్పల్లి రైతు వేదిక వరకు ట్రాక్టర్ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే రైతులతో కలిసి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సభలో రైతులందరూ 24 గంటల కరెంట్ కావాలని, రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని తీర్మానం చేశారు.ధర్మారం మండలం కటికెనపల్లి రైతువేదికలో జరిగిన సభలో స్థానిక నాయకులు రైతులతో కలిసి పాల్గొని కరెంటు విషయంలో కాంగ్రెస్ తీరుపై నిరసన తెలిపారు. రామగిరి మండలం రత్నాపూర్ రైతు వేదికలో సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఊళ్లలోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.
జగిత్యాల రూరల్ మండలం చల్గల్లోని రైతు వేదికలో జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి, రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని తీర్మానం చేశారు. అనంతరం రైతువేదిక వద్ద భోజనం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ రైతులకు వడ్డించారు. రైతులతో కలిసి భోజనం చేశారు. ధర్మపురి మండలం నర్సయ్యపల్లె రైతు వేదికలో జరిగిన సభకు డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి హాజరై రైతులతో కలిసి కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. పెగడపల్లి, వెల్గటూర్ మండలకేంద్రాలతో పాటు గొల్లపల్లి మండలం చందోలి రైతు వేదికల్లో సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ తీరుపై నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు హాజరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలకేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సభకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదు దశాబ్ధాలు పాలించిన పార్టీ రైతులకు కనీసం నారు మడికి నీరందించిందా? అంటూ ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక, ఇల్లందకుంట మండలకేంద్రాల్లో జరిగిన సభలకు మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. వీణవంకలో ముందుగా బస్టాండ్ నుంచి కమాన్చౌరస్తా మీదుగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా, కౌశిక్రెడ్డితో పాటు స్థాని ప్రజాప్రతినిధులు పాడె మోశారు.
రైతు ప్రభుత్వానికి మద్దతిద్దాం
నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేస్తూ, రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతు పక్షపాతిగా ఉన్న బీఆర్ఎస్కు రైతులమంతా మన భవిష్యత్తు కోసం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కరెంటు మోటర్ కనెక్షన్ కోసం డీడీలు కట్టినా నెలలు గడిచేది. స్తంభాలు, తీగలు మనం కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు మీసేవలో దరఖాస్తు చేసుకున్న వారం లోపు విద్యుత్ సిబ్బంది వచ్చి స్తంభాలు పెడుతున్నరు. తీగలు లాగుతున్నరు. కరెంటు మోటర్కు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నరు. నాటి ప్రభుత్వం మేలు చేసిందా?, ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకు మేలు జరుగుతుందా? అన్నది రైతులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలుద్దాం.
-సింగిరెడ్డి రవికాంత్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ (ఇబ్రహీంపట్నం)
కాంగ్రెసోళ్లు వాస్తవాలు తెల్సుకోవాలె
తెలంగాణ రాష్ట్రం రాక ముందు లోవోల్టేజీ, కరెంటు కోతలు వంటి సమస్యలు చాలా ఉండేవి. రోజుకు కనీసం రెండు మూడు గంటలు కూడా కరెంటు వచ్చేది కాదు. రాష్ట్రం వచ్చినంక అసలు కరెంటు సమస్యలే లేవు. పగటి పూట పంటలకు నీటి తడి అందించేందుకు మంచిగ వస్తంది. కాంగ్రెసోళ్లు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఇప్పటికైనా వారి వైఖరి మార్చుకోవాలి. లేకుంటే పుట్టగతులుండవ్.
– బాయి లింగారెడ్డి, రైతు, వర్షకొండ(ఇబ్రహీంపట్నం)
కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు
కరెంటుపై కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం మాకు వ్యవసాయానికి సరిపోయేంత ఉచిత విద్యుత్ ఇస్తంది. 24 గంటల నాణ్యమైన కరెంటు ఉండబట్టే రైతుల కష్టాలు తీరినయి. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటల కరంటు చాలు అని మాట్లాడడం విడ్డూరం. సీఎం కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుల పుణ్యంతో నీళ్ల కరువు తీరిపోయింది. పంటలకు నీళ్లు రావాలంటే కరెంటు కావాలి కదా. మూడు గంటలు ఇస్తే పంటలకు నీళ్లు ఎట్ల అందుతయి. తెలంగాణ రాక ముందు కరెంటు లేక ఎంతో గోస పడ్డం. కాంగ్రెస్ అస్తే మళ్లీ అదే గోస వస్తది. మాకు మంచిగ కరెంటిస్తున్న కేసీఆర్ వెంటనే ఉంటం.
– సురకంటి రాఘవరెడ్డి, రైతు, మద్దులపల్లి (పెగడపల్లి)
24 గంటలిస్తే వాళ్లకేం నష్టం
కేసీఆర్ సర్కారు 24 గంటల కరెంటు ఇస్తే వాళ్లకేం నష్టమో సమజైతలేదు. వాళ్లు ఇయ్యరు.. ఇచ్చేవాళ్లను ఎత్తిపొడ్తరు. నాడు కాంగ్రెసోళ్లు నీళ్లు, క రెంటు ఇయ్యకపోవడం వల్లనే గదా రైతులు ఆత్మహత్యలు చేసుకున్రు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అచ్చినంక ఏటా మూడు పంటలు పండుతున్నయ్. 24 గంటలు నీళ్లు, కరెంటు ఉంటంది. ఇంకా పెట్టుబడి సాయం చేత్తండు. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే హక్కు రేంవత్రెడ్డికి లేదు.
– సాగర్ల తిరుపతి, రైతు, రత్నాపూర్
రేవంత్రెడ్డికి బుద్ది చెప్తం
కాంగ్రెస్ సర్కారున్నప్పుడు కరెంట్ ఎప్పుడచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెల్వకపోయేది. అర్ధరాత్రి పొలాల దగ్గర్నే కరెంట్ కోసం చూసుకుంట కూసునెటోళ్లం. టైంకు కరెంటు రాక పొలాలు ఎండిపోయేవి. పంటలు నష్టపోయెటోళ్లం. ఎవుసానికి 24 గంటల కరెంట్ కావాలి. లేకుంటే మళ్లీ పాత రోజలస్తయ్. ఇప్పుడు మాకు కావాల్సినంత కరెంట్తో పొలాలు పారించుకుంటున్నం. ఆనందంగా బతుకుతున్నం. కాంగ్రెసోళ్లు మా బతుకులను మళ్లీ రోడ్డుమీద పడేయాలని చూస్తున్నరు. మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న రేవంత్రెడ్డికి బుద్ది చెప్తం.
-ఎనగందుల మల్లేశ్, ఎగ్లాస్పూర్(అంతర్గాం)
రైతులమంటే ఏందో చూపిస్తం
నాకు రెండెకరాల భూమి ఉంది. గత ప్రభుత్వాలు పంటల సాగు కోసం రాత్రి పూట కరెంటు ఇచ్చేవి. దాని కోసం రాత్రి లైట్ పట్టుకొని బాయి దగ్గరికి పోయేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక వెంటనే సీఎం కేసీఆర్ సారు మాకు 24 గంటల కరెంటును ఉచితంగ ఇస్తున్నరు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పడం చాలా బాధనిపించింది. రానున్న ఎన్నికల్లో వారికి రైతులం అంటే ఏందో చేసి చూపిస్తం.
– రావుల వీరస్వామి, రైతు (ఇల్లందకుంట)
మూడు గంటలతో ఎకరం కూడా పారదు
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఉచిత కరెంట్పై రేవంత్రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలే. రైతు ఎవుసానికి వాడే కరెంట్ గురించి ఆయనకు ఏమాత్రం తెలియదు. రేవంత్ మాట్లాడిన ప్రకారం మూడు గంటల కరెంట్తో ఎకరం కూడా పారదు. ఆ పార్టీ సర్కారున్నప్పుడు కరెంట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలియక పోయేది. రైతులం ఇంటి దగ్గర కరెంటుందని బావి వద్దకు మోటర్ పెడుదామని పోయేసరికి ఉండకపోయేది. అప్పుడు కరెంటు ఇవ్వాలని రైతులం రోడ్డెక్కి రాస్తారోకోలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను నిలదీసినం. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత కరెంట్తోనే రైతులం ఆనందంగా పంటలు పండించుకుంటున్నం.
– గూడ రాజిరెడ్డి, రైతు, కటికెనపల్లి (ధర్మారం)
రేవంత్కు రైతుల ఓట్లడిగే హక్కే లేదు
నాకు మా ఊళ్లె మూడెకరాల భూమి ఉంది. కేసీఆర్ ఇస్తున్న ఉచిత కరెంట్తో రైతులం రెండు పంటలు పండించుకుంటున్నం. ఇప్పుడైతే కరెంట్ గురించి ఏ బాధ లేదు. రైతులమంతా ఆనందంగా ఉన్నం. ప్రశాంతంగా ఉన్న రైతులను కరెంట్ గురించి ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడటం కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డికి సరికాదు. ఇలా మాట్లాడితే రైతులమంతా ఊరూరా తిరగబడాల్సి వస్తది. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెబుతం. పంటలకు కరెంట్ ఇవ్వని రేవంత్కు మా రైతుల ఓట్లడిగే హక్కే లేదు.
– మాదాని మల్లయ్య, రైతు, (న్యూ కొత్తపల్లి)(ధర్మారం)
రైతులను గోసపెడితే పుట్టగతులుండవ్
మట్టిని నమ్ముకొని బతికే రైతుల బాధలు ఏనాడూ పట్టించుకోని రేవంత్రెడ్డికి కరెంట్ గురించి ఎట్లా తెలుస్తది. ఎన్నో ప్రభుత్వాలు అచ్చినయి.. పోయినయి.. ఏనాడూ రైతుల గురించి ఆలోచన జేసిన నాయకుడు లేడు. ఏ టైంకు అత్తదో.. ఏ టైంకు పోతదో తెలువని కరెంట్ గురించి కండ్లళ్ల వత్తులేసుకొని ఎదిరి సూసెటోళ్లం. పెండ్లాం పిల్లలను ఇడిసిపెట్టి రాత్రిపూట మోటర్ల దగ్గరికి పోయి పొలాలు పారిచ్చుకునెటోళ్లం. అచ్చీరాని కరెంట్తోని మోటర్లు కాలిపోతే అప్పుల పాలైనం. అర్ధరాత్రి, అపరాత్రి అనక కరెంట్ కాడికి పోతే పాములు కుట్టి, కరెంట్ షాక్గొట్టి ఎంతో మంది సచ్చిపోయిన్రు. కరెంట్ అడిగితే ఆనాడు చంద్రబాబు నాయుడు పోలీసోళ్లతోని కొట్టిచ్చిండు. ఆనాడు ఒక్కలు పట్టించుకోలె. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ సార్ రైతుల గోస జూసి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తండు. రాత్రిళ్లు పోవుడు లేదు, మోటర్లు కాలుడు లేదు. 24 గంటల కరెంట్తోని రైతులం సంబురంగ ఉంటే ఓర్వలేని రేవంత్రెడ్డి మూడు గంటలు సాలు అని మాట్లాడుతండు. రైతులను ఇట్ల గోసపెడితే పుట్టగతులుండవ్.
– నీల మొండయ్య, రైతు (వీణవంక)
రైతులు బాగుపడుతున్నరని కండ్లమంట
ఎవుసంజేసిన మొఖమైతే 3 గంటలు కావాలో.. 24 గంటల కరెంట్ కావాలో తెలుస్తది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్న పాపాన పోలే. రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టిన్రు. కరెంట్, నీళ్లు లేక సాగు భూములు నెర్రెలు వారినై. నీళ్ల కోసం బాయిలు తవ్వినం. ఎక్కువ తక్కువ కరెంటస్తే మోటర్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలు జేసుకుంటే ఆనాడు మాట్లాడని రేవంత్రెడ్డి ఇప్పుడు ఎట్ల మాటాడ్లుతండు. మూడు గంటల కరెంట్కు 20 గుంటల మడికూడా సక్కగ వారది. 24 గంటల కరెంట్ ఉంటెనే రైతులు టైంకు సాగుజేసుకుంటున్నరు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తందని, రైతులు బాగుపడుతున్నరని కండ్లుమండి రేవంత్రెడ్డి మాట్లాడుతండు. అధికారం కోసంగాకుండా రైతుల కోసం ఆలోచన జేసే నాయకుడే మాకు కావాలి. రైతులందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉంటరు.
– గొట్టుముక్కల రవీందర్రావు, రైతు బేతిగల్ (వీణవంక)
మూడు గంటలు సాలనుడు మంచిది కాదు
నాకు 8 ఎకరాల వ్యసాయ భూమి ఉంది. రెండు బావులున్నయ్. ఒకప్పుడు కరెంటు ఎప్పడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. కరెంటు ఎక్కువ తక్కువ రావడంతో మోటర్లు కాలిపోయేవి. వాటి రిపేరింగ్ కోసం అప్పులు చేసేది. సీఎం కేసీఆర్ సార్ రైతు బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తడు. పెట్టుబడి సాయం, రైతు బీమా వంటివి ఇస్తున్నడు. రేవంత్రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేసిండా?. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని అనుడు మంచి పద్ధతి కాదు.
– చింతిరెడ్డి మల్లారెడ్డి, రైతు (ఇల్లందకుంట)
రాత్రిపూట కరెంటే మా నాన్న పాణం తీసింది
మాకు రెండెకరాల భూమి ఉంది. అప్పటికి తెలంగాణ రాలె. నాకు పదేళ్లుంటయ్. రాత్రి పూట కరెంట్ వస్తదని మా నాన్న పొలానికి నీళ్లు పెట్టడానికి మోటర్ కాడికి పోయిండు. మళ్ల తిరిగిరాలె. కరెంట్ షాక్తో బావిల పడి చనిపోయిండు. రాత్రిపూట కరెంటే మానాన్న పాణం తీసింది. ఆ తర్వాత మా అమ్మ భయంతో నన్ను తీసుకుని రాత్రిపూట మోటర్ వద్దకు పోయేది. కేసీఆర్ సార్ సీఎం అయినంక ఆ బాధలు పోయినయ్. 24 గంటల ఉచిత కరెంట్ పుణ్యమాని పొద్దంతనే పొలానికి నీరు పారుతుంది. ఇప్పుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు ఇస్తే సరిపోతదని అంటున్నడు. అతని మాటలింటేనే మళ్లీ పాతరోజులు వస్తాయా ఏంది అని భయమైతది. రేవంత్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు.
– కుమ్మరి వెంకటేశ్, రైతు, కిషన్రావుపేట (వెల్గటూర్)