హుజూరాబాద్టౌన్, జనవరి 6: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డా. ఏ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 137/ఏ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆవరణలో మొకలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దవాఖాన పర్యవేక్షణాధికారి డా. రాజేందర్రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి కన్నతల్లి లాంటిదన్నారు. దానిని కాపాడుకోవడం సామాజిక బాధ్యతని చెప్పారు. పర్యావరణాన్ని రక్షించుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా దవాఖానలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన అలయన్స్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బీ మనోజ్, తూమ్ వెంకట్రెడ్డి, దవాఖాన ఆర్ఎంవో ఎన్ సుధాకర్రావు, డా. ఎన్ నారాయణరెడ్డి, నర్సింగ్ పర్యవేక్షణాధికారి జాన్సీరాణి, హెడ్ నర్స్ నిర్మల, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సులు కళ్యాణి, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.