కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 25: ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకుంటే అమెరికాలో న్యాయ అవకాశాలు పుషలంగా ఉన్నాయని, లీగల్ కోడింగ్తో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జనతారెడ్డి కంచర్ల సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల సెమినార్ హాల్లో అమెరికా న్యాయరంగ అవకాశాలపై శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు జనతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ‘ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ లీగల్ సెక్టర్ స్పెసిఫిక్ టూ యూఎస్ఏ అండ్ కరెంట్ ఇమిగ్రేషన్ ట్రెండ్స్ ఇన్ ట్రంప్ 2.0’ అనే అంశంపై వివరించారు. ప్రత్యేక అతిథి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని సూచించారు. అమెరికాలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు నుంచి అమెరికాకు వివిధ ఉపాధి అవకాశాల కోసం వచ్చే అభ్యర్థులకు సలహాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సతీశ్కుమార్, న్యాయశాఖ అధ్యాపకులు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, కిమ్స్, జస్టిస్ కొమరయ్య, విశ్వవిద్యాలయ న్యాయకళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.