మెట్పల్లి/కోరుట్ల, నవంబర్25: జగిత్యాల జిల్లాలో ఐటీహబ్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కు మద్దతుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఏయిర్ ఇండియా వంటి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తుందని అమిత్షా చేసిన ప్రకటన కనీసం నమ్మేటట్టు ఉందా? అని ప్రశ్నించారు. ఆయన పేరు అమిత్షా కాదు, అబద్ధాల బాద్షాగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
నిజాం చక్కెర ఫ్యాక్టరీలను ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, లే ఆఫ్ తెచ్చి కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. ఢిల్లీ నుంచి మోడీ, అమిత్షా, రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ, యోగి ఆదిత్యనాథ్ వంటి బయటి వాళ్లు ఎన్నికల ప్రచారం కోసం వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని, తమది నలుగురితో కూడిన కుటుం బం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అరాచకం, గొడవలేనని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి తప్ప మరొక ఆలోచన లేదన్నారు. ప్రజలందరూ అభివృద్ధి వైపా, అరాచకం వైపా ఆలోచించాల్సిన అవసరం అవసరం ఉందని కోరారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు చెప్పింది ఎన్నడూ చేయలేవని, ఆ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగిందన్నారు. 2.32 లక్షల ఉద్యోగాలను ప్రకటించగా 1.60 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసినట్లు తెలిపారు. న్యూయార్క్ తలపించేలా హైదరాబాద్ను అభివృద్ధి అయిందని, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని, ప్రైవేట్ కంపెనీలలో దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రజల కోసం ఆలోచించి పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులను తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు బీమా, అలాగే ప్రైవేట్ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు రూ.15 లక్షల దాకా ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె ప్రకటించారు. రేషన్ షాపుల ద్వారా దొడ్డు రకానికి బదులుగా సన్న రకం బియ్యం పంపిణీ చేస్తామన్నారు. గతంలో ఇలాంటి మానవత్వం కలిగిన ప్రభుత్వాన్ని చూశారా? అని ప్రజలు అడిగారు. కేంద్రంలో మోడీ పాలనలో ఉప్పు, పప్పు, మంచినూనె, ఉల్లిగడ్డలు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని మండిపడ్డారు. రూ.400 ఉన్నగ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.2 వేలు పెన్షన్ ఇస్తుంటే అందులో గ్యాస్ సిలిండర్కు రూ.1200 పోతున్నాయని, ఎన్ని సార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసినా ధర తగ్గించలేదని, దాంతో తామే తగ్గించి పేదలపై భార పడకూడదని సీఎం కేసీఆర్ రూ.400కే సిలిండర్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. బీడీలు రాని, లేదా మరే ఆధారం లేకుండా ఇంట్లో ఉండే మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తుందన్నారు.
కోరుట్ల పట్టణంలోని జంబిగద్దె సమీపంలో ప్రభుత్వ భూమిలో వెయ్యి ప్లాట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చిరు వ్యాపారుల కోసం దళిత బంధు తరహాలో పథకం ప్రవేశపెట్టి ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామన్నారు. దుబ్బాకలో పద్మశాలీలు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ అప్పట్లో రాష్ట్రమంతటా భిక్షాటన చేసి రూ.50 లక్షలు పోగుచేసి బాధిత పద్మశాలీ కుటుంబాలకు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. సిరిసిల్లలో పద్మశాలి నేత కార్మికులకు ఉపాధి అందించాలనే సంకల్పంతో 90 లక్షల బతుకమ్మ చీరలను ఆర్డరిచ్చి ఆర్థికంగా నేత కార్మికులకు అండగా నిలిచినట్లు చెప్పారు.