పెగడపల్లి, నవంబర్ 7: ‘కాంగ్రెస్ రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఏ ఒక్క పనీ చేయలే. స్కాంలు చేయడం జేబులు నింపుకోవడం తప్ప ప్రజల మేలు ఎన్నడూ కోరలే. రాష్ర్టాన్ని అంధకారంలో పడేసిన్రు. ఇప్పుడు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నరు. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నరు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదకొండు సార్లు ఇచ్చాం కదా..? అప్పుడు ఏం చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా..? ఇలాగే అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పి కర్ణాటక ప్రజలను మోసం చేసి గెలిచి చేతులెత్తేసిన్రు. ప్రజలారా.. జాగ్రత్తగా ఉండండి,’ అని ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మనకు బీఆర్ఎస్సే శ్రీ రామరక్ష అని, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పదేండ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధిం చి, 20 రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిచిందని, ఒకవేళ కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పారు.
మంగళవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి, నందగిరి, నామాపూర్, మ్యాకవెంకయ్యపల్లి, నర్సింహునిపేట గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టగా, ఊరూరా మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కర్ణాటకలో అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు నెలలైనా ఏం చేయలేక చేతులెత్తేసిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులు, ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదని, నీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మోసపు హామీలతో వస్తున్నదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందన్నారు. విద్య, వైద్య రంగం ప్రజలకు చేరువైందని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నియోజకవర్గానికో 100 పడకల దవాఖాన, 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఏటా రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ.10 వేల కోట్లు, రైతు బంధు కోసం రూ.12500 కోట్లు, రైతు భీమా కోసం రూ.1500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, సంపద సృష్టించడం, పేద ప్రజలకు పంచి పెట్టడం కేసీఆర్ పాలసీ అని స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, మంత్రి ఈశ్వర్ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత వోరుగంటి రమణారావు, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, ఎంపీపీ గోళి శోభా-సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ లోక నిర్మల, సర్పంచులు జిట్టబోయిన కొడయ్య, గాజుల రాకేశ్, ఇనుగాండ్ల కరుణాకర్రెడ్డి, ఇనుకొండ లక్ష్మి-మోహన్రెడ్డి, నేరువట్ల బాబుస్వామి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, ఎంపీటీసీ చిర్ర రజిత-రమణాకర్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు లోక మల్లారెడ్డి, బండి వెంకన్న, నందగిరి, నంచర్ల విండో చైర్మన్లు కర్ర భాస్కర్రెడ్డి, మంత్రి వేణుగోపాల్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు ఉపుపగండ్ల నరేందర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు ఉన్నారు.