కోర్టుచౌరస్తా, మే 18: ఇటీవల కేంద్రం మార్పులు చేర్పులతో ప్రవేశపెట్టిన నూతన చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వింజమూరి వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని అడిషనల్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో శనివారం జిల్లా కోర్టు ఆవరణలో వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మొదటి శనివారం పోలీస్ అధికారుల సమీక్షా సమావేశంలో వారికి నూతన చట్టాలపై అవగాహన కలిగించాలని, ప్రతి మూడో శనివారం ప్రాసిక్యూటర్ల సమీక్షా సమావేశంలో కూడా వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.
ప్రాసిక్యూటర్లు కేసుల విచారణ సమయంలో ఆయా కేసులపై పూర్తి అవగాహనతో ఉండాలని, సంబంధిత న్యాయమూర్తులతో సమన్వయంతో కలిసి వెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం కరీంనగర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరస్వామి నూతన చట్టాల గురించి వివరించారు. సమావేశంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జ్యోతిరెడ్డి, నర్సింగరావు, తుమికి పవన్ కుమార్, జూలూరు శ్రీరాములు, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, శరత్, పెంట శ్రీనివాస్, కాసారం మల్లేశం, జంగిలి మల్లికార్జున్, సీనియర్ ఏపీపీ మురళీధర్ రావు, వసంత తదితరులు పాల్గొన్నారు.