జూలపల్లి, డిసెంబర్ 13 : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమలు చేస్తున్న ‘దళిత బంధు’ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పునరుద్ఘాటించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 46 మంది మహిళలకు కుట్టు శిక్షణ పొందగా, వారికి మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లతో పాటు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 17 లక్షల దళిత కటుంబాలున్నాయనీ, దశల వారీగా దళితబంధు పథకం అందించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏడాది కాలంలో ప్రతి ఒక్కరికీ దళితబంధు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల మందికి వివిధ కేటగిరీల్లో రూ.2016, రూ.3016 చొప్పున పింఛన్లు అందిస్తున్నామని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కేవలం రూ.750 పింఛన్ మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు.
స్వరాష్ట్రంలో విద్య, వైద్య సేవలు మెరుగు పడ్డాయన్నారు. ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి భవిష్యత్లో తమను ఆశీర్వదించాలని కోరారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు చిన్న పరిశ్రమ రూపొందించుకుని స్కూల్ యూనిఫాం దక్కించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. జిల్లాలో దాదాపు వెయ్యి మందికి కుట్టు శిక్షణ ఇప్పించామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ విన్నూత్న రీతిలో పథకాలు రూపొందించారని గుర్తు చేశారు.
సొంతింటి కల సాకారం : పెద్దపల్లి ఎమ్మెల్యే
పేదోళ్ల సొంతింటి కల సాకారం చేయడానికి సొంత ఖాళీ స్థలం ఉన్న లబ్ధిదారులను గుర్తించి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తున్నారని, ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమ పథకం పొందుతుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పోల్చుకోవాలని సూచించారు. కాగా, ఎస్సారెస్పీ డీ-83 ప్రధాన కాల్వ పరిధిలోని 10 ఎల్ ఉపకాల్వ మరమ్మతు పనుల పురోగతిని మంత్రి, ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కరెడ్డి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఆర్డీవో వెంకటమాధవరావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన్, సర్పంచులు మేచినేని సంతోష్రావు, దారబోయిన నరసింహం, బంటు ఎల్లయ్య, ఈర్ల మల్లేశం, మాంకాలి తిరుపతి, ఎంపీటీసీ సభ్యుడు తమ్మడవేని మల్లేశం, తహసీల్దార్ అబుబాకర్, ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఎంపీవో కిరణ్, నాయకులు విశారపు వెంకటేశం, కొత్త రవీందర్, సొల్లు శ్యామ్, తొంటి బుచ్చయ్య, తోట ముత్తులింగం, పాటకుల అనిల్, శాతళ్ల కాంతయ్య, కుంట రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.