పత్తి రైతులకు ఈ యేడాది నిరాశే మిగులుతున్నది. వాతావరణం అనుకూలించక అంతంతే దిగుబడి రాగా, ఆపై ధర లేక పెట్టుబడులు ఎల్లని దుస్థితి ఉన్నది. గతేడాది రికార్డుస్థాయిలో క్వింటాలు 10 వేల దాకా పలికి మెరిపించిన కాటన్ ధర, ఈసారి అమాంతం పడిపోయింది. నవంబర్ నుంచి కొనుగోళ్లు జరుగుతుండగా, ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ మాత్రమే 7020 మద్దతు ధర చెల్లిస్తున్నది. ప్రైవేట్లో అయితే 6900 లోపే పలుకుతున్నది. ఈసారి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడంతోనే ధరలు తగ్గగా, తాము తీవ్రంగా నష్టపోతున్నామని కర్షకలోకం వాపోతున్నది.
పెద్దపల్లి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): గతేడాది పత్తి రైతు పంట పండింది. కాసుల వర్షం కురిసింది. ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ మద్దతు ధరను మించి పోటీపడి మరీ కొనుగోలు చేయడం కనిపించింది. క్వింటాల్ ధర 10 వేల దాకా పలికింది. ఈ క్రమంలో ఈసారి కూడా అదే రేటు వస్తుందని రైతులు ఆశపడ్డారు. కరీంనగర్ జిల్లాలో 34,273 మంది రైతులు 45,843 ఎకరాలు.. జగిత్యాల జిల్లాలో 15,456 మంది రైతులు 20,250 ఎకరాలు.. పెద్దపల్లి జిల్లాలో 44,331 మంది రైతులు 57,600 ఎకరాలు..సిరిసిల్ల జిల్లాలో 33,748 మంది రైతులు 54,489 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దిగుబడి కూడా బాగానే వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, ఈ యేడు వర్షాలతో పంట దెబ్బతిన్నది. దిగుబడి తగ్గిపోయింది. సాధారణంగా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్లు రావాల్సి ఉన్నా.. ఎక్కడ కూడా 10 క్వింటాళ్లు దాటడం లేదని రైతులు చెబుతున్నారు. చాలా చోట్ల 8 క్వింటాళ్లకు మించి రావడం లేదని వాపోతున్నారు.
గతేడాది పత్తి మంచి లాభాలను అందించింది. అప్పుడు గరిష్ఠంగా క్వింటాలు ధర ప్రైవేట్లో 10 వేలు పలుకగా, కనిష్ఠంగా 7,500 దాకా వచ్చింది. అయితే ఈసారి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడంతో ధర పడిపోతున్నది. గత నవంబర్ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ క్వింటాల్కు మద్దతు ధర 7,020 చెల్లిస్తున్నది. పొడవు పింజ రకం పత్తి తేమ 8 శాతం ఉంటేనే 7,020 మద్దతు ధర ఇస్తున్నది. 8 నుంచి 12 మధ్యలో తేమ శాతం ఉంటే ఒక్కో శాతానికి క్వింటాల్కు 70.20 పైసలు తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నది.
సీసీఐ తేమ పేరిట రేట్ తగ్గిస్తుండడం, డబ్బుల చెల్లింపులోనూ కొంత ఆలస్యం చేస్తుండడంతో రైతులు ప్రైవేట్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా పలువురు వ్యాపారులు ధరను మరింత తగ్గిస్తున్నారు. గతేడాది పోటీ పడి కొన్నా.. ఈసారి మొదట 6,700కు కొన్నారు. తర్వాత 6900 వరకు పెరిగినా.. అక్కడక్కడా 6,400 వరకే చెల్లిస్తున్నారు. దీంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు ప్రైవేటు ద్వారా మార్కెట్ యార్డులో 20,150 క్వింటాళ్లు, జిన్నింగ్ మిల్లుల ద్వారా 22,800 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా 43,120 క్వింటాళ్ల కొనుగోళ్లు చేశారు.
జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం. రైతులకు ఎకడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లను ప్రారంభించారు. మార్కెట్ రేటును బట్టి రోజుకో రకంగా కొంటున్నారు. సీసీఐ ప్రభుత్వ మద్దతు ధర 7,020గా ప్రకటించింది. అయితే రైతులు పలు కారణాలతో ప్రైవేటుగా విక్రయించేందుకే ఆసక్తిని చూపుతున్నారు.
-ప్రవీణ్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి (పెద్దపల్లి)
ఈ యేడాది దిగుబడి లేదు. ధర లేదు. రైతులకు చానా నష్టం. నేను నాలుగెకరాల్లో పత్తి సాగు చేసిన. ఎకరానికి 15 క్వింటాళ్లు రావాలి. కానీ, 10 క్వింటాళ్ల దాకా కూడా వచ్చేటట్టు లేదు. ఇప్పటిదాకా 12 క్వింటాళ్లు అమ్మిన. పంటకు వైరస్ అచ్చింది. వర్షానికి ఆకు జాడిచ్చింది. నీళ్లు కట్టినంక మాడిపోయింది. దాంతోటి దిగుబడి తగ్గింది. పోయినసారి క్వింటాల్కు 9 వేల దాకా రేటు వచ్చింది. ఈసారి 6500 వచ్చుడే కష్టమున్నది.
– జీ హన్మంతు, రైతు, చిన్నకల్వల (పెద్దపల్లి మండలం)