కరీంనగర్ రూరల్, డిసెంబర్ 14: సహజ వనరుల పరిరక్షణ మన అందరి బాధ్యతని హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ధనపురి సాగర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లోని తీగలగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘సహజ వనరుల పరిరక్షణ అందరి బాధ్యత’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకు సహజ సిద్ధంగా లభిస్తున్న వనరులను పొదుపుగా వాడుకుంటూ, పరిరక్షించుకోవాలన్నారు. వాటిని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. మంగళవారం ‘సేవ్ ఎర్త్ సేవ్ వాటర్’ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను డాక్టర్ అలీఖాన్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు జిలా రమణ, గోగురి శ్రీధర్రెడ్డి, ప్రధానోపాధ్యాయిని పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.