వేములవాడ, జనవరి 1: సిరిసిల్ల కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. సెస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా నాయక త్వం వైఫల్యంపై పార్టీ కేడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. ఇటీవలే కొంద రు జిల్లాస్థాయి నాయకుల ఒంటెత్తు పోకడలతో పార్టీలో ఇమడలేకపోతున్నానని జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్తేజ చారి రాజీనామా చే సింది మరువకముందే ఆదివారం మరోచోట అసమ్మతి రాగం వినిపించింది.
పొన్నంతో సీనియర్లకు అన్యాయం: నాయకుడు చంద్రశేఖర్
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను నమ్ముకున్న నాయకులు నిండా మునుగుడేనని, అన్యాయమే తప్ప న్యాయం జరుగడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముడికే చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం వేములవాడలో విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి నాయకులపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ పార్టీనే నమ్ముకొని ఏండ్లపాటు పనిచేస్తున్న సీనియర్లకు సరైన గుర్తింపు దొరకడం లేదని వాపోయారు. వలసదారులు, పార్టీ మారిన నాయకులకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాలుగు పార్టీలు మారిన ఆది శ్రీనివాస్ను ఇటీవలే జిల్లా అధ్యక్షుడిగా నియమించి, నాలుగు పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఆయన ఎప్పుడైతే పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి సీనియర్లకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందని, ఆయన తీరు నచ్చక ఎంతో మంది ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీని వీడారని, కేడర్ లేక వేములవాడలో పార్టీ కార్యాలయం సైతం మూతపడిందని ఆరోపించారు.
ఆది శ్రీనివాస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. స్థానిక సంస్థల్లో ఎందుకు రావడం లేదో ఆలోచించుకోవాలని ప్రశ్నించిన ఆయన, ఆయనతో అయ్యిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో.. ఇప్పుడు సెస్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయిందని వాపోయారు. సాధారణ ఓట్లు సైతం రాబట్టలేకపోయారని దుయ్యబట్టారు. పొన్నం ప్రభాకర్ వైఫల్యాలతో వేములవాడలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జిలను కలిసి వివరిస్తామని, పార్టీకి పూర్వ వైభవం కోసం పనిచేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు ఏటి యాదవ్, బాలరాజు, శ్రీనివాస్, అంబటి చంద్ర శేఖర్, కొమురయ్య, ఎల్లయ్య, సంతు, మహేశ్, తదితరులు ఉన్నారు.