కార్పొరేషన్, మార్చి 17: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉద్యోగోన్నతుల కల్పన, విధుల కేటాయింపు విషయంలో ఆయా విభాగాల అధికారుల ఇష్టారాజ్యం అన్నట్లుగా సాగుతున్నది. అర్హత లేకున్నా తమ వారు అనుకుంటే చాలు మంచిపోస్టు అప్పగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒకే స్థాయిలోని సిబ్బందికి కొందరికి కార్యాలయంలోని విధులు అప్పగిస్తుండగా… మరికొందరికి క్షేత్రస్థాయిలో పనులు కేటాయించడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. తమ వారికి మంచిపోస్టులు ఇప్పించి, మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పలువురు సిబ్బంది రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కారుణ్య నియామకాల విషయంలో ఉన్నతాధికారులు తమకు నచ్చినట్లుగా పోస్టింగ్ ఇవ్వడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను సిబ్బంది కోరుతున్నారు.
నగరపాలక సంస్థలో కారుణ్య నియామకాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నియామకాలు ఆయా సమయాల్లో ఉన్నతాధికారుల ఇష్టారీతి అన్నట్లుగా మారుతున్నదని బల్దియా సిబ్బంది వాపోతున్నారు. దీంతో తాము ఉద్యోగోన్నతులు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎనిమిదేళ్ల క్రితం నాటి ఉన్నతాధికారులు కారుణ్య నియామకాల్లో డిగ్రీ, పీజీ చేసిన వారికి అటెండర్ స్థాయిలోనే పోస్టింగ్ ఇచ్చారు. అనంతరం వచ్చిన అధికారులు మాత్రం ఆయా అభ్యర్థుల విద్యార్హత స్థాయిని పరిగణనలోకి తీసుకొని జూనియర్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కల్పిస్తున్న ఉద్యోగోన్నతుల్లో తాము అన్యాయానికి గురవుతున్నామని గతంలో కారుణ్య నియామకాల్లో పోస్టింగ్ పొందిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు ఇటీవల రాష్ట్ర మున్సిపల్ శాఖ రీజినల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా తమ నియామకాలు చేసే సమయంలో అన్ని అర్హతలున్నా, బల్దియాలో ఖాళీలు ఉన్నా కూడా రోస్టర్ రిజిస్టర్ లేదన్న కారణంతో అటెండర్ పోస్టింగ్స్ ఇచ్చారని, అనంతరం జరిగిన కారుణ్య నియామకాల్లో మాత్రం జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో తమకు ఎలాంటి ఉద్యోగోన్నతులు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కొంత మంది ఇటీవల ఇతర రాష్ర్టాలకు చెందిన డిగ్రీ పట్టాలను సమర్పించి ఉద్యోగోన్నతులు పొందినట్లు విమర్శించారు. నిబంధనల మేరకు ఇతర రాష్ర్టాల డిగ్రీలు చెల్లకపోయినా కూడా పలువురు అధికారులు తమ ఇష్టం వచ్చినట్లుగా ఉద్యోగోన్నతులు ఇస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
నగరపాలక సంస్థలో సిబ్బందికి విధుల కేటాయింపుల్లోనూ ఇష్టారాజ్యం అన్నట్లుగానే సాగుతున్నది. ముఖ్యంగా ఒకే స్థాయి సిబ్బందికి విధులు కేటాయించే విషయంలో తమవారికి అనుకూలమైన పోస్టింగ్ ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బిల్ కలెక్టర్ స్థాయిలో ఉండాల్సిన వారికి ఆర్ఐ పోస్టు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వార్డు ఆఫీసర్లుగా నియామకమైన వారు ముడుపులు ఇస్తే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు కేటాయిస్తుండగా… ఇవ్వని వారికి క్షేత్రస్థాయిలో పనులు ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగోన్నతుల విషయంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిపై రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు. ఈ విషయంలో రీజినల్ డైరెక్టర్కు చేసిన ఫిర్యాదులో పూర్తి వివరాలు తెలిపినట్లు సమాచారం.