జగిత్యాల, మార్చి 26 : లోకసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు(పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో)లను, ఇతర పోలింగ్ అధికారులు (ఓపీవో) ర్యాండమైజెషన్ నిర్వహించారు. రిజర్వ్ సిబ్బందిని కలుపుకుని జిల్లా పరిధిలోని మూడు సెగ్మెంట్లకు మొత్తం 4,544 మంది పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ జరిపారు.
వీరిలో పీవోలు 1,136 మంది, ఏపీవోలు 1,136 , ఓపీవోలు 2,272 మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్ పోలింగ్పై శిక్షణ తరగతులు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి హన్మంతు రావు, సంబంధిత తహసీల్దార్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీమ్, తదితరులు పాల్గొన్నారు.