కార్పొరేషన్, జనవరి 27: కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్సిటీ పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్సిటీలో భాగంగా ఇదివరకే ప్రారంభించిన ప నుల్లో పురోగతిలో, టెండర్ దశలో, ప్రారంభంలోనే ఉన్నవాటి వివరాలతో జాబితాను రూపొందించి అందించాలని సూచించారు. ప్రాధాన్యాన్ని బట్టి పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. ఏవైనా తప్పు లు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్, జనవరి 27: పార్లమెంటు ఎన్నికల కోసం రూపొందిస్తున్న తుది ఓటరు జాబితా కచ్చితత్వంతో ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ బీఎల్వోలకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో చొప్పదండి నియోజకవర్గ బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను సిద్ధం చేయడంలో బీఎల్వోలదే కీలకపాత్ర అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటరు జాబితాలో సవరణలు గుర్తిస్తే వెంటనే సరిచేయాలని, హోం ఓటింగ్ కోసం దివ్యాంగులు, వయోవృద్ధుల వివరాలు సేకరించుకుని సిద్ధంగా ఉండాలన్నారు.