కమాన్చౌరస్తా, మార్చి 22: ప్రైవేటు పరిశ్రమలు, విద్యాసంస్థల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు వారధి సొసైటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన వారధి సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు కల్పించిన ఉద్యోగావకాశాలు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. వారధి సొసైటీ కార్యక్రమాలను మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు ఐటీ టవర్ ఉన్నట్లు తెలిపారు.
ఇందుకు పరిశ్రమల జీఎం, వారధి సొసైటీ కలిసి నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించే అంశంపై దృష్టిసారించాలని పేరొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు ఉద్యోగాలపై యువత దృష్టిసారించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని పేరొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై యువత దృష్టిసారించాలని సూచించారు. మూడు నెలల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో డిఫరెంట్ ఉద్యోగాలపై అవగాహన కల్పించాలని పేరొన్నారు.
ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల నియామకం కోసం జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ చైర్మన్, కన్వీనర్గా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఈవో జనార్దన్ రావు, డీఐసీ జీఎం నవీన్కుమార్, మెప్మా పీడీ రవీందర్, డీఆర్డీవో శ్రీధర్, ఎస్సీ డెవలప్మెంట్ డీడీ నతానియేల్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్ కిరణ్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దేవేందర్ రావు, ఎస్సారార్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.