కలెక్టరేట్, ఫిబ్రవరి 7: బాలికలు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ, తమ ఎదుగుదలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జాతీయ బాలికా దినోత్సవం-2024లో భాగంగా నగరంలోని బాలలకు జ్యోతిబాఫూలే మైదానంలో బుధవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుప్రాయంలోనే జీవిత లక్ష్యం ఎంచుకునే స్థాయికి నేటి తరం బాలలు ఎదిగారని ప్రశంసించారు.
బాలికలు ప్రతి కార్యక్రమంలో ధైర్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇటీవల ప్రయోగించి విజయవంతమైన చంద్రయాన్-3లో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. బాలికా సాధికారత దిశగా జిల్లాలో స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి బాలిక ఒక మొక్కను నాటాలని కోరారు. చిత్రలేఖనం పోటీల్లో కలెక్టర్ కూడా పాల్గొని ఓ చిన్నారి చిత్రాన్ని గీశారు. ఈ పోటీల్లో 261 మంది విద్యార్థులు పాల్గొనగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి, మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి, డీఈవో జనార్దన్రావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈవీఎంల గోడౌన్లో ఈనెల 5 నుంచి ఎఫ్ఎల్సీ నిర్వహిస్తుండగా, బుధవారం కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షించారు. ఎఫ్ఎల్సీ, వెబ్కాస్టింగ్, ఈవీఎంలను భద్రపరచడం, వెబ్కాస్టింగ్ గదులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఫిబ్రవరి 7: నిత్యజీవితంలో యువతకు క్రీడలు భాగం కావాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన హాస్టల్ విద్యార్థుల క్రీడా పోటీలను ఆమె జ్యోతిప్రజ్వలన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి అనిల్ ప్రకాశ్, సాంఘిక, సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నతానియేల్, క్రీడల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి రాజవీరు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 7: లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. బుధవారం ఆమె చిగురుమామిడి మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో ఆయిల్ పామ్ నర్సరీని, బొమ్మనపల్లిలో ఈజీఎస్ ద్వారా సాగు చేసిన మామిడి తోట, ఇందుర్తిలో సంపద వనాన్ని సందర్శించారు. బొమ్మనపల్లిలో ఈజీఎస్ ద్వారా మూడు ఎకరాల్లో మామిడి తోటసాగు చేస్తున్న రైతు గంప సతీశ్ను అభినందించారు. ఇందుర్తి సంపద వనాన్ని మరింత అభివృద్ధి చేయాలని అధికారులను అదేశించారు.
బొమ్మనపల్లి, ఇందుర్తి ఈజీఎస్ పనులపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి, మండల ప్రత్యేకాధికారి నతానియేల్, డీఆర్డీవో శ్రీలత, ఎంపీపీ వినీత, అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి, ఉద్యానవన డివిజన్ అధికారి మంజువాణి, ఎంపీడీవో నర్సయ్య, డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథి, ఎంపీవో శ్రవణ్ కుమార్, లోహియా కంపెనీ మేనేజర్ భరత్, ఇన్చార్జి ఏపీవో రాజయ్య, పంచాయతీ కార్యదర్శులు వెంకటరమణారెడ్డి, వెంకటరమణ, రమణారెడ్డి, ఈజీఎస్ టీఏలు అంజలి, వెంకటేశ్ పాల్గొన్నారు.