కలెక్టరేట్, ఫిబ్రవరి 10: ఓటరు జాబితా పక్కాగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ అధికారులకు సూచించారు. ఓటరు జాబితా సవరణలు, మీ సేవలో అప్లికేషన్ల పెండింగ్, కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల వివరాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో డుప్లికేట్, పుట్టిన తేదీ తప్పుగాపడిన వారి వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఫామ్-7 తీసుకొని సవరణలు చేయాలన్నా రు. వాటిని ఆన్లైన్లో ఈనెల 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేయవద్దని సూచించారు.
పెండింగ్ దరఖాస్తులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. కోర్టు కేసుల విషయమై ముస్తాబాద్ తహసీల్దార్ సమాచారం ఇవ్వకపోవడంతో మందలించారు. పూర్తి వివరాలతో తనను కలువాలన్నారు. అనంతరం ప్రభుత్వ భూముల వివరాల సేకరణపై ఆరా తీశారు. వీర్నపల్లి మండలంలో ప్రభుత్వ వివరాలు అందించిన తహసీల్దార్ను అభినందించారు. వీసీలో అదనపు కలెక్టర్ గౌతమి, ఎస్డీసీ గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంరెడ్డి, పర్యవేక్షకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
గంభీరావుపేట మండలం లింగన్నపేట ఆరోగ్య కేంద్రం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్కాస్) సర్టిఫికెట్ పొందగా, ఇదే స్ఫూర్తితో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శనివారం కలెక్టరేట్లో లింగన్నపేట పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు మెరుమైన వైద్య సేవలందించాలని సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఇన్చార్జి డీఎంహెచ్వో డా రజిత, వైద్యులు శ్రీరాములు, నయీమా, ఉమ, సాగ ర్, లింగన్నపేట మెడికల్ ఆఫీసర్ డా వేణుగోపాల్రెడ్డి, తదితరులు ఉన్నారు.