మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 17: వాళ్లు అన్నదమ్ములు..పెండ్లి చేసుకుంటామని నమ్మించి ఇద్దరు మహిళలతో నాలుగేండ్లు సహజీవనం చేశారు. తీరా వేరే వారిని వివాహం చేసుకుని మోసం చేశారు. బాధిత మహిళలు శనివారం అన్నదమ్ముల ఇంటి ఎదుట న్యాయం చేయాలని బైఠాయించిన ఘటన మానకొండూర్ మండలం గంగిపల్లిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగిపల్లికి చెందిన గుడిశెల రమేశ్, వెంకటేశ్ ఇద్దరు అన్నదమ్ములు. వెంకటేశ్ హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. నాలుగేండ్ల కిందట అక్కడే ఉంటున్న కర్ణాటకకు చెందిన ఇటుక రాధికను (భర్త మరణించిన మహిళ) ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెండ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె వద్ద తిరిగిస్తానని రూ. 10 లక్షలు తీసుకున్నాడు. తీరా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రాధిక ఏడాది క్రితం మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెంకటేశ్కు కౌన్సెలింగ్ చేశారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో శనివారం గంగిపల్లికి చేరుకొని వెంకటేశ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అలాగే వెంకటేశ్ సోదరుడు గుడిసెల రమేశ్ సైతం ఇదే తరహాలో మరో మహిళను మోసం చేశాడు. గంగిపల్లికి చెందిన రమేశ్ అదే గ్రామానికి చెందిన అవివాహితురాలైన నూనె చంద్రకళతో స్నేహం చేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి నాలుగేండ్లుగా హైదరాబాద్, కరీంనగర్లో ఉంటూ సహజీవనం చేశాడు. ఏడాది క్రితం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా రమేశ్ పట్టించుకోలేదు. శనివారం ఇటుక రాధిక గంగిపల్లికి చేరుకొని గ్రామస్తుల సూచనల మేరకు వెంకటేశ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న చంద్రకళ కూడా అక్కడికి చేరుకున్నది. రాధికతో కలిసి నిరసన తెలిపింది. వీరిపై వెంకటేశ్, రమేశ్ కుటుంబీకులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. చంద్రకళను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. రాధికను మానకొండూర్ ఠాణాకు తరలించారు.