Dubbapalli | సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 18 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము వచ్చింది. దీంతో అంగన్వాడీ టీచర్, ఆయా, పిల్లలు, గ్రామస్తులు భయాందోళన చెందారు. ప్రమాదాన్ని పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం రోజువారీ గానే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు వచ్చారు.
మధ్యాహ్నం సమయంలో శబ్దం రావడంతో గమనించిన సిబ్బంది వెంటనే గదిని పరిశీలించారు. బుష్ బుష్ అంటూ నాగు పామ కనిపించింది. దీంతో వెంటనే గ్రామస్తుల సాయంతో పాములు పట్టుకునే వ్యక్తిని రప్పించి పామును పట్టించడంతో నిర్వహకులు, పిల్లలు గ్రామస్తులు, ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 16న కూడా నాగుపాము వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. చిన్నపిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రంలో పాములు సంచరించడంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.