కరీంనగర్, జనవరి 3 (నమస్తే తెంగాణ) : నాడు ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడుండేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. రోజులో నాలుగైదు గంటలు కూడా సరిగా ఉండేది కాదు. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడి ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి. బడుగు, బలహీన వర్గాల ప్రజల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడి బతికే నాయీబ్రాహ్మణులు, రజకులైతే కరెంట్ కోసం పడని ఇబ్బందులు లేవు. సెలూన్లు, లాండ్రీ షాపులు పెట్టుకుని జీవించే ఈ వర్గాల ప్రజలు సమాజ సేవలో భాగస్తులుగా గుర్తించబడినా.. ఉమ్మడి రాష్ట్రంలో వీరికి ఎలాంటి చేయూత లభించలేదు. కానీ, స్వరాష్ట్రంలో విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. అన్ని రంగాలకూ 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నది. సాగుకు పూర్తి ఉచితంగా ఇస్తుండగా, నాయీబ్రాహ్మణులు, రజకుల కోసం ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతతో నాయీబ్రాహ్మణులు సెలూన్లు, రజకులు లాండ్రీ షాపులు, ధోబీఘాట్లు, డ్రైక్లీనింగ్ షాపులు నడుపుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
మా అసోంటోళ్లకు మంచి చేస్తున్నడు
సీఎం కేసీఆర్ సార్ మా అసోంటి బక్కోళ్లకు శానా మంచి పనులు చేస్తున్నడు. మా నాయీబ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నడు. నాది చిన్న దుకాణం. ఒక్కటే సీటు. నేనొక్కన్నే పని చేసుకుంట. ఫ్రీ కరెంట్ ఇస్తున్నరని తెల్వంగనే దరఖాస్తు పెట్టుకున్న. సార్లచ్చి మీటర్ వెట్టిపోయిండ్రు. అప్పటిసంది నాకు బిల్లే వస్తలేదు. అంతకు ముందైతే నాకు మూడు నాలుగువందల బిల్లచ్చేది. ఇప్పడు ఒక్క పైసా కడ్తలేను. శానా సంతోషగున్నది.
– పురంపెల్లి స్వామి, నాయీబ్రాహ్మణుడు, జ్యోతినగర్ (కరీంనగర్)
నిన్న బొగ్గుల పెట్టె.. నేడు కరెంట్ పెట్టె
..పై చిత్రంలో ఇస్త్రీ చేస్తూ కనిపిస్తున్నది పోచయ్య. నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని మంకమ్మతోటలో లాండ్రీ షాపు నడిపిస్తున్నడు. ఇంతకు ముందు బొగ్గుల పెట్టెతో ఇస్త్రీ చేసేవాడు. పది జతలు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ, కేసీఆర్ ప్రతి నెలా ఫ్రీ కరెంట్ ఇస్తుండడంతో ఇప్పుడు కరెంట్ పెట్టె వాడుతున్నడు. పరిసరాల్లోని ఇండ్లల్లో బట్టలు సేకరించి, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్తో లాండ్రీ చేస్తున్నడు. రోజుకు పదుల సంఖ్యలో డ్రెస్సులు ఐరన్ చేస్తూ నాలుగు పైసలు సంపాదించుకుంటున్నడు. ఇదంతా సీఎం కేసీఆర్ దయేనని సంతోషంగా చెబుతున్నడు.
ఇస్త్రీ పని మానేసి మళ్లీ చేస్తున్న
అందరిండ్లలో గ్యాస్ పొయ్యిలే వాడుకుంటున్నరు. కట్టెల పొయ్యిలు లేక బొగ్గులు కరువైనయ్. కరెంటుతో ఇస్త్రీ చేద్దామంటే బిల్లులు బాగా వస్తున్నయ్. బట్టలు ఇస్త్రీ చేస్తే గిట్టుబాటు అయితలేదు. ఇస్త్రీ దుకాణం బంద్పెట్టి ఏ కూలీ పనికో పోదామనుకున్న. చేతగాని టైంల ఏ పని చేత్తవని ఇంట్ల అందరూ వద్దన్నరు. ఈ టైంలనే కేసీఆర్ సార్ కరెంటు ఫ్రీ ఇత్తమని దేవునోలే చెప్పిండు. పాణం లేసొచ్చినట్లయ్యింది. మంచి ఇస్త్రీ పెట్టె కొనుక్కుని పని చేసుకుంటున్న. కరెంటు బిల్లు మాఫీ వల్ల నెలకు 1600 దాకా మిగులుతున్నయ్.
– చింతల్తాడపు రాజయ్య, రజకుడు (సిరిసిల్ల)
ఏడాదికి 30 వేల దాకా మిగులుతున్నయ్
నా పేరు పృథ్వీ. మాది జగిత్యాల. నేను హెయిర్ సెలూన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. కొన్నేండ్ల కిందట షాపు ప్రారంభించినంక కేటగిరీ-1(గృహ అవసరాల)లో కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని అధికారుల దగ్గరికి వెళ్లిన. నిబంధనల ప్రకారం ఇవ్వడం కుదరదని కేటగిరీ-2(కమర్షియల్)లో మీటర్ మంజూరు చేసిన్రు. ప్రతి నెలా 230 నుంచి 240 యూనిట్లు వాడుకునేది. యూనిట్కు 9.90 చొప్పున 2,475, స్థిర చార్జి 10, కస్టమర్ చార్జి 100 కలిపి మొత్తం 2500 వరకు బిల్లు వచ్చేది. ఏడాది దాదాపు 30 వేలు కట్టేది. నిజానికి నా పెట్టుబడి, నెల కిరాయి కంటే ఈ బిల్లే ఎక్కువ. ఇది నా ఒక్కడి సమస్యే కాదు, నాలా వృత్తి పనిచేసే ప్రతి నాయీబ్రాహ్మణుడిది. నాడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాకు పెద్ద మేలు చేసిండు. 250 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడంతో మాకు పెద్ద రిలీఫ్ అయింది. కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ ఇంత గొప్పగా ఆలోచించలేదు. సీఎం కేసీఆర్ చూపిన ఔదార్యంతో చాలా మంది సెలూన్లు ఏర్పాటు చేసుకొని బతికేందుకు ముందుకు వస్తున్నరు.
అందరికీ ప్రయోజనం కలుగుతున్నది
జిల్లాలోని రజకుల లాండ్రీ షాపులకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం. సబ్సిడీ విద్యుత్తో అందరికీ ప్రయోజనం కలుగుతున్నది. వారిపై చాలా భారం తగ్గింది.
– బొంకూరి సుదర్శన్, ట్రాన్స్కో ఎస్ఈ (పెద్దపల్లి)
ఏడాదిన్నరగా లబ్ధి
రాష్ట్రంలో విద్యుదుత్పత్తిని సమృద్ధిగా సముపార్జించుకున్న తర్వాత ఒక్కో వర్గానికి ప్రభుత్వం రాయితీ కరెంట్ను సరఫరా చేస్తూ వస్తున్నది. 2017 డిసెంబర్ అర్ధరాత్రి నుంచి వ్యవసాయ రంగానికి 24గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నది. ఆ తర్వాత నాయీబ్రాహ్మణులు, రజకులకు ఇస్తున్నది. 2020 నవంబర్లో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు. 2021 మే నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు జూన్, జూలై నుంచి సెలూన్లు, లాండ్రీ, ధోబీఘాట్లు, డ్రైక్లీనింగ్ షాపులకు ప్రత్యేక మీటర్లు బిగించి 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తూ వస్తున్నారు. నాయీబ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ షాపులకు సగటున 1,500 వరకు కరెంట్ బిల్లులు వచ్చేవి. చిన్న చిన్న షాపులకు కూడా నిబంధనల ప్రకారం కమర్షియల్ కేటగిరీలో మీటర్లు ఉండేవి. వీటికి ప్రత్యేకంగా బిల్లులు వేసేవారు. దీంతో ఏ చిన్న షాపు చూసినా కరెంట్ బిల్లు వేలల్లో వచ్చేది. ఇటు రజకుల పరిస్థితి కూడా అంతే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మిషన్లు వాడే డ్రైక్లినింగ్ షాపుల్లో నెల నెలా బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చేవి. కరెంట్ చార్జీలు చెల్లించలేక బొగ్గుల ఇస్త్రీ పెట్టెలతో రజకులు ఐరన్ చేసేవారు. ఈ బిల్లులు కూడా తడిసి మోపెడయ్యేవి.
నెలకు రెండు వేలకుపైగా ఆదా
..ఈ చిత్రంలో కనిపిస్తున్న రజకుని పేరు బూత్కూరి మహేందర్. కరీంనగర్ మండలం నగునూర్కు చెందిన ఇతను గతంలో బతుకుదెరువు కోసం మహారాష్ట్ర వెళ్లాడు. అక్కడ వృత్తి సరిగ్గా నడవక పోవడంతో తిరిగి వచ్చి కరీంనగర్లోని జ్యోతినగర్లో డ్రైక్లీనింగ్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. గతంలో ఇతనికి నెలకు 700 నుంచి 800 వరకు ఒక్కో నెల వెయ్యి వరకు కరెంట్ బిల్లు వచ్చేది. దీంతో బిల్లులు చెల్లించలేక బొగ్గుల ఇస్త్రీ పెట్టె వాడే వాడు. ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుండడంతో ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ తెచ్చుకున్నాడు. రోజుకు 60 నుంచి 70 డ్రైస్సులు ఇస్త్రీ చేసుకుంటున్నా ఒక్క రూపాయి కరెంట్ బిల్లు రావడం లేదు. 250 యూనిట్లలోపే కరెంట్ వాడుకుంటున్న మహేందర్కు నెలకు కనీసం 2వేలకుపైగా మిగులుతున్నాయి. ఈ పథకాన్ని ప్రకటించినప్పుడే తన ఫొటోతో ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాన్ని ప్రేమ్ కట్టించుకుని షాపులో భద్రపర్చుకుని సీఎం కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
బిల్లు కట్టాల్సిన రందే లేదు
ఫుట్పాత్లమీద డబ్బాలు పెట్టుకుని గడ్డాలు, క్షౌరాలు చేస్తూ బతుకుతున్నం. రోజంతా గిరాకీ ఉండదు. మంచి రోజులుంటేనే మాకు చేతి నిండా పని. రోజూ గిరాకీ కోసం ఎదిరి చూడాల్సిందే. చేసిన సంపాదనంతా కరెంటు బిల్లులకే సరి పోతుండె. కేసీఆర్ సార్ మాకు నెలకు 250 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నడు. బిల్లుకట్టాల్సిన రందే లేకుండా చేసిండు. ముఖ్యమంత్రి జెయ్యవట్టి మేం ఇయ్యాళ సంతోషంగ ఉన్నం.
– సామనపల్లి నవీన్ సాయి, నాయీబ్రాహ్మణుడు (సిరిసిల్ల)
మొత్తం ఫ్రీ కరెంటే..
..ఇతని పేరు నెలిగొండ ఉమామహేశ్వర్. కరీంనగర్ జ్యోతినగర్లో సెలూన్ షాపు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఫ్రీ కరెంట్ ఇవ్వకముందు ఇతని సెలూన్ షాపునకు నెలకు 1,500 నుంచి 2000 వరకు బిల్లు వచ్చేది. దీంతో వచ్చిన గిరాకీలో ఎక్కువ బిల్లుకే పోయేది. తెలంగాణ రాకముందు పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉమామహేశ్వర్ అప్పట్లో కరెంటే ఉండేది కాదని, ఉన్నప్పుడు వాడినా బిల్లులు మాత్రం వాసిపోయేవని చెప్పాడు. కరెంట్ ఉంటే కటింగో, గడ్డమో చేసుకుని నాలుగు పైసలు సంపాదించుకునే ఈ వృత్తిలో అప్పట్లో కరెంట్ సరిగా లేక ఉమామహేశ్వర్లాగే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు 24 గంటల పాటు కరెంట్ ఉంటోంది. ఎప్పుడు కస్టమర్ వచ్చినా ఉమామహేశ్వర్లాగే ప్రతి నాయీబ్రాహ్మణుడు హాయిగా పనిచేసుకుంటున్నారు. 250 యూనిట్లలోపు ఉచిత కరెంట్ పొందుతూ నెలకు సగటున 2 వేలకుపైగా ఆదా చేసుకుంటున్నారు. తమకు ఇలాంటి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉంటే ఎంతో బాగుండేదని ఉమామహేశ్వర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
పెద్ద ఖర్చు తప్పింది
నాది బస్టాండ్ ముందటి షాపు. ఆరు కుర్చీలు ఉన్నై. షాపు నడిస్తే ఎప్పటికీ లైట్లు, ఫ్యాన్లు, షేవింగ్ మిషన్లు, సెలూన్ మిషిన్లు నడుస్తయి. వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు మాకు ఆ బాధ లేదు. సర్కార్ ఇచ్చే 250 యూనిట్లు మంచిగ సరిపోతున్నది. ఒక్క ఎండాకాలం కొంచెం దాటుతున్నది. అయినా, ఏడాదంతా అందుతున్నది. సీఎం సార్కు మా నాయీబ్రాహ్మణులమంతా రుణపడి ఉంటం. అసలు ఇలా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని కూడా రాష్ట్రంలో ఎక్కడా.. ఎప్పుడూ మేం అడగలేదు. కానీ, సీఎం సారే మాకో వరంలాగా ఇచ్చిండు.
– సూత్రపు పరమేశ్వర్, సెలూన్షాపు (పెద్దపల్లి)
సీఎం కేసీఆర్ మాకు దేవుడు
మా కుల వృత్తుల వాళ్లకు సీఎం కేసీఆర్ దేవుడు. మా షాపుల్లో ఆయన ఫొటో పెట్టుకుంటున్నం. నాకు ఇద్దరు పిల్లలు. టేలా పెట్టుకొని ఇస్త్రీ షాపు నడిపిస్తున్నా. ఒకప్పుడు బొగ్గుల ఇస్త్రీ పెట్టె ఉండేది. దాంతోటి శానా తిప్పలవడ్డా. నిప్కలు అంగీలు, ప్యాంట్ల మీద పడేవి. గిరాకోళ్లు తిట్టేది. బొగ్గులు సరిగా దొరకక సగం రోజులు షాపు మూసేసుకునేది. కానీ, ఇప్పుడు ఆ బాధ లేదు. సీఎం సార్ ఫ్రీ కరెంటు ఇచ్చుడు మొదలువెట్టిన తర్వాత ఆరు వేలతో కరెంటు ఇస్త్రీ పెట్టె కొనుక్కున్న. ఇప్పుడు నాకు ఏ రందీ లేదు. పొద్దున వత్తున్నా. షాపు తీసుకుంటున్నా. కరెంటు ఆన్ చేసుకొని ఇస్త్రీ చేసుకుంటున్న. రోజు నాలుగు పైసలు కనిపిస్తున్నయ్.
– నస్పూరి కనుకయ్య, లాండ్రీ షాపు (పెద్దపల్లి)