కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమాలగడ్డ జగిత్యాల, ఇంటి ఇలవేల్పు రాజన్న క్షేత్రంలో అధినేత కేసీఆర్కు జనం నీరాజనం పలికారు. జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్, వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పోటెత్తారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు నలుమూలల నుంచి తరలి వచ్చారు. సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోగా, చాలా మంది రోడ్లపై ఉండిపోయారు. సభకు వెళ్లే దారుల్లో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో కనిపించారు. అధినేత కేసీఆర్ ఆయా వేదికల వద్దకు చేరుకోగానే, ఈలలు, చప్పట్లతో స్వాగతం పలికారు. ‘జై కేసీఆర్’ ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఆద్యంతం తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. నాటి కాంగ్రెస్ పాలనలో అనుభవించిన కష్టాలు.. నేటి బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలను వివరించారు.
జగిత్యాల, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థులు డాక్టర్ సంజయ్ కుమార్, చల్మెడ లక్ష్మీనర్సింహారావుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ తర్వాత నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీని తూర్పార పట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని చెబు తూనే, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఈ ప్రాంత ప్రజలకు ఎదురైన అనుభవాలను కండ్లకు కట్టినట్లుగా వివరించి అందరినీ ఆలోచింపజేశారు. ఇదే సమయంలో ధరణి తేవాల్సిన అవసరం ఏమిటో..? ఎందుకు తెచ్చామో..? దానికోసం ఎంత సాధన చేశామో చెప్పిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాళ్లు వస్తే ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నారు. ధరణి ఉండాలా..? వద్దా..? మీరే చెప్పాలంటూ ప్రశ్నించగా, సభలోని జనం అంతా ఒక్కసారిగా చేతులెత్తి ఉండాలంటూ నినాదాలు ఇచ్చారు.
24 గంటల కరెంటు రైతులకు అవసరం లేదని కాంగ్రెస్వాళ్లు చెబుతున్నారని, నిజంగా మీకు అవసరం లేదా..? అని అడుగగా.. తమకు ఉండాల్సిందే అంటూ చెబుతూనే, ‘జైకేసీఆర్’ అంటూ నినదించారు. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్, అది వృథా అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు.. నిజంగా వృథాయేనా..? మీరు చెప్పాలంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించగా, ‘వృథాకాదు’ అంటూ స్పష్టం చేశారు. రైతాంగానికి ఇంకా చేయాల్సినది ఎంతో ఉందని, ప్రభుత్వం రాగానే ఇప్పుడున్న రైతు బంధును ఎకరాకు రూ.16వేలకు పెంచుతామని ప్రకటించగా, ‘జై కేసీఆర్’ అంటూ నలుదిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లు కొట్టారు. ఓటు మీ వజ్రాయుధమని, ఆలోచించి ఓటువేయాలని వివరించిన తీరు, ప్రజలను ఆకట్టుకుంది. ఏ మాత్రం ఏమరపాటుతో గానీ, సెంటిమెంట్లకు లొంగి ఓటేసినా ఆ తర్వాత జరిగే పరిణామాలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా వివరించి చెప్పారు. ప్రధానంగా యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చపెట్టాలని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజలకు శాపం. రైతులకు అశనిపాతం. ఆ పార్టీ తప్పుడు వాగ్దానాలను ప్రజలు గమనించాలి. అన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కత్తి ఒకడికి ఇచ్చి, యుద్ధం ఒకడిని చేయమనడం సరికాదు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రం సాఫీగా అభివృద్ధి పథంలో సాగుతుంది. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గెలిచి ఏం చేస్తడు? ఏమన్నా కేసీఆర్ను నాలుగు తిట్లు తిట్టడానికి పనికి వస్తరు తప్పా చేసేదేమీ ఉండదు. రేపు కరెంటు బంద్ అయితే తెస్తడా..? వీఆర్వోలు వచ్చి భూములు ఆగమైతే ఏమన్నా చేస్తడా..? రేపు ఎవరో సీఎం అయితే వాడు చేస్తడు. ఈయన ఏం చేయాలే.. భజన చేయాలి. అంతకుమించి ఏమన్న ఉంటదా..? అందుకే నేను చెప్పేది. గడబిడ అయిపోయి ఆగమై ఓట్లు వేయద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
– జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్
వేములవాడ నియోజకవర్గం ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నది. ఇక్కడి రైతుల ముఖాలు తెల్లబడుతున్నయి. గతంలో ఈ ప్రాంత ప్రజలు బొంబాయి, దుబాయికు వలసబాట పట్టి ఎన్నో బాధలు పడ్డరు. రాష్ట్రం వచ్చిన తర్వాత తిరిగివచ్చిన్రు. వారి బతుకులు ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నయి. గల్ఫ్కు వెళ్లినవారు తిరిగి వచ్చి సాగు చేసుకుంటున్నరు. ఈ సమయంల ఎవరో వచ్చి ఏడ్చిన్రని చూసి ఓటు వేస్తే ఆ తర్వాత మనం ఏడ్వాల్సి వస్తది. ఎందుకంటే కరెంటు రాదు. ధరణి గంగలో కలుస్తది. సంక్షేమ పథకాలకు రాం రాం అంటరు. అఫీసుల చుట్టూ తిరగాలి. పనిమీద, పాలసీల మీద ఓటువేయాలే కానీ, ఏడ్చేవారిని చూసి ఓటు వేయవద్దు.
– వేములవాడలో ముఖ్యమంత్రి కేసీఆర్
కాంగ్రెస్ల పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. ఎవరు ముఖ్యమంత్రి అయితడో వాళ్లకే తెల్వది. వాడు గెలిచేది లేదు.. సచ్చేది లేదు. మనమే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నం. అందులో అనుమానం లేదు. గాలి లేదు గత్తర లేదు. ఉన్నకాడికి బీఆర్ఎస్దే గాలి ఉన్నది. ఇప్పటికీ 86 సభల్లో పాల్గొన్న. రేపు, ఎల్లుండి నా ప్రచారం కంప్లీట్ అయితది. ఏనుగెల్లింది.. తోక చిక్కింది. ఇవాళ జగిత్యాలలో చెబుతున్న. మళ్లీ వచ్చిననాడు యాది చేస్త. వందశాతం భయంకరమైన మెజార్టీతో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది.
– ముఖ్యమంత్రి కేసీఆర్
గర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అన్ని విధాలా కలిసొచ్చిన పూర్వ కరీంనగర్ గడ్డ నుంచే ఈ సారి కూడా ఎన్నికల శంఖారావం పూరించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో హుస్నాబాద్ వేదికగానే ప్రారంభించి విజయం అందుకున్న ఆయన, మరోసారి ఇక్కడి నుంచే కదనరంగంలోకి దిగారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పద మూడు నియోజకవర్గాలకు గాను పదమూడు సభలు పూర్తి చేశారు.
గత నెల 15న హుస్నాబాద్, 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరుట్ల, 7న మంథని, పెద్దపల్లి, 17న ఒకే రోజు కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, 20న మానకొండూర్, 24న రామగుండ నియోజకవర్గాల సభల్లో పాల్గొన్నారు. తాజాగా ఆదివారం (26న) జగిత్యాల, వేములవాడ సభలకు హాజరై దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సభ విజయోత్సవ సభను తలపించగా, ఎక్కడ చూసినా జనం నీరాజనం పట్టారు. ప్రతి సభకూ ప్రభంజనంలా తరలివచ్చారు.
ప్రాంగణం కిక్కిరిసిపోయి బయట రోడ్లపై ఉండి సీఎం కేసీఆర్ ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. నాటి కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, సాగు, తాగునీరు, కరెంట్ లేక అనుభవించిన కష్టాలు.. నేటి పాలనలో సాధించిన విజయాలు, పథకాలతో ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు. 24గంటల కరెంట్, ధరణి, రైతుబంధు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గురించి అర్థమయ్యేలా వివరించి, కొత్త ఆలోచనకు తెరలేపారు. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా చర్చ జరుగుతుండడం, ఇప్పటి వరకు అన్ని చోట్లా సభలు గ్రాండ్ సక్సెస్ కాగా, బీఆర్ఎస్ నాయకులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.