కార్పొరేషన్/ముకరంపుర/తెలంగాణ చౌక్/కమాన్ చౌరస్తా, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ కూతురు వివాహానికి హాజరు కావడంతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తేనీటి విందు స్వీకరించారు. బుధవారం జగిత్యాలలో పర్యటించిన సీఎం, గురువారం మధ్యాహ్నం 1.48 గంటలకు నగరంలోని దిగువ మానేరు జలాశయం సమీపంలోని రీజినల్ స్పోర్ట్స్ సూల్ ఆవరణలోని హెలీ ప్యాడ్కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ యాదగిరి సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పుష్పగుచ్ఛాలు అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో హెలీప్యాడ్ నుంచి ‘ప్రగతి రథం’ బస్సులో వీ కన్వెన్షన్లో జరిగే కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులు పూజాగగన్దీర్ కౌర్, సర్దార్ మణిధర్సింగ్ను ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి క్రిస్ట్రియన్ కాలనీలోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని తేనీటి విందు స్వీకరించి, కుటుంబసభ్యులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి వెండితో తయారు చేసిన వేంకటేశ్వరుడి ప్రతిమను సీఎంకు అందించారు. సాయంత్రం 3.50 గంటలకు సీఎం అక్కడి నుంచి హెలీప్యాడ్కు చేరుకొని, హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, సంతోష్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, వాల రమణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, టీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్, చల్ల హరిశంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఐజీ నాగిరెడ్డి, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ బందోబస్తును పర్యవేక్షించారు.