ఉద్యమ నేత కేసీఆర్ అడుగు జాడల్లో పద్నాలుగేండ్లు నడిచిన. ఆయన గొంతుకు ఆటనై.. పాటనై సాగిన. తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను ఈ స్థాయికి తెచ్చింది కేసీఆరే. ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపిన. మానకొండూర్కు అడగకముందే ఆయన అన్ని ఇచ్చిండు. మిడ్మానేరు, అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్, తోటపల్లి రిజర్వాయర్, రంగనాయక రిజర్వాయర్లు కట్టించిండు. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీళ్లిచ్చి రైతుల సాగునీటి గోస తీర్చిండు. దళితుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు తెచ్చిండు. ఎస్సీ నియోజకవర్గమైన మానకొండూర్లో కూడా దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి. నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధును అందించాలి. నియోజకవర్గ ప్రజలు నన్ను రెండు సార్లు దీవించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. ఇపుడు మరోసారి గెలిపించండి.
– మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్
హుజూరాబాద్ తరహాలోనే మానకొండూర్ నియోజకవర్గంలో ‘దళిత బంధు’ ఒకేసారి వర్తింప జేస్తామని, ప్రతి ఇంటికీ అందిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పథకం మంజూరు చేయడమే కాదు, తానే స్వయంగా వచ్చి కూర్చొని అమలు చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ వచ్చినప్పుడల్లా ఓ స్కీం ప్రకటిస్తున్నానని, ఇవాళ ఆటో రిక్షా వాళ్లకు శుభవార్త చెబుతున్నానని, ఏడాది కోసారి కట్టే ఫిట్నెస్ చార్జీలను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. సర్వేలన్నీ రసమయి బాలకిషన్ విజయాన్ని సూచిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో సోమవారం నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరై, సుదీర్ఘ ప్రసంగాలతో ఆలోచింపజేశారు.
ఒకవైపు రసమయి సేవలను కొనియాడుతూనే.. మరోవైపు మానకొండూర్ నియోజకవర్గం 2014 ముందు ఎలా ఉన్నదో.. ప్రస్తుతం ఎలా ఉన్నదో కండ్లకు కట్టినట్లగా వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ డ్రామాలు, మూడు గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్ల వినియోగం, ధరణి రద్దు వంటి అంశాలను వివరిస్తూనే.. బీజేపీని తూర్పార పట్టారు. మోటర్లకు మీటర్లు పెట్టనందుకు 25వేల కోట్ల గ్రాంటు కోత పెట్టిందని, అలాగే ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వలేదని, ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయవద్దని పిలుపునిచ్చారు. ఒక వేళ వేస్తే మోరిలో వేసినట్లే అవుతుందని విమర్శించారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చపెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ప్రతి ఓటరు తన ఓటును ఆలోచించివేయాలని, ఆగమై ఓటు వేస్తే ఐదేండ్ల భవిష్యత్ అంధకారం అవుతుందని హెచ్చరించారు.
– కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : ‘మిత్రుడు బాలకిషన్ నన్నొక కోరిక కోరిండు. ఆయన కూడా దళితబిడ్డ కాబట్టి ఆజాతి బాధలు తెలుసు. హుజూరాబాద్లో పెట్టినట్లుగా మా మానకొండూరు నియోజకవర్గంలోనూ దళితబంధు పథకం అమలు చేయాలని కోరిండు. ఒకేసారి అందరికీ ఇవ్వాలని అడిగిండు. మీరు రసమయి బాలకిషన్ను 70 నుంచి 80 వేల మెజార్టీతో గెలిపించండి. గ్యారంటీగా మీకు దళితబంధు ఒకేసారి అమలు చేస్త. మానకొండూర్ మొత్తం నియోజకవర్గానికి హుజూరాబాద్ తరహాలోనే ఒకేసారి దళిత కుటుంబాలకు ఇచ్చే బాధ్యత నాది. రసమయి బాలకిషన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. మీకు స్కీం సాంక్షన్ చేయడమేకాదు, హుజూరాబాద్ ఎలాగైతే వెళ్లా నో అలాగే, మానకొండూర్ వచ్చి అమలు చేస్త’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
మానకొండూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను సోమవారం ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించగా, సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత జాతి తరతరాలుగా దోపిడీకి, వివక్షకు గురైందని, ఊర్ల నుంచి వెలివేయబడిందని, వాళ్లు మన సాటి బిడ్డలు కారా..? మనలా మనసులు కారా..? వాళ్లను బాగు చేసే ఉద్దేశం ఉండద్దా..? అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం సిద్దించినప్పుడే నెహ్రూ కాలంలోనే దళితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి ఉంటే.. 75 ఏండ్ల తర్వాత కూడా దళితజాతిలో ఇంత దరిద్రం ఎందుకు ఉంటుందన్నారు. దళిత బిడ్డలు, దళిత వర్గం మేధావులు ఆలోచన చేయాలని సూచించారు. దేశంలోఎవరూ ఆలోచన చేయకున్నా.. దేశానికి కూడా ఇక్కడి నుంచే బుద్ధి చెప్పాలని తాను దళితబంధు పథకాన్ని తీసుకొచ్చానని స్పష్టం చేశారు.
ఆ పథకం ఇప్పుడు దళిత కుటుంబాల్లో కాంతులు నింపుతున్నదని, హుజూరాబాద్ నియోజకవర్గం పోతే ఆ కుటుంబాల్లో సంతోషం కనిపిస్తున్నదని వివరించారు. ఎన్నో రాష్ర్టాల నుంచి వచ్చి ఈ స్కీంను చూసి వెళ్తున్నారని, ఇదొక్కటే కాదు, అనేక స్కీంలు అలానే ఉన్నాయని చెప్పారు. డబ్బు ఎనభై ఏండ్ల నుంచి ఎప్పుడూ లేనంతగా తెలంగాణ పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్నదని, అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా నిలస్తున్నదని చెప్పారు. వ్యవసాయం, వైద్యం బాగుపడ్డాయని, రాబోయే రోజుల్లో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడికక్కడే పెడుతామని, దాంతో పిల్లలకు ఎక్కడికక్కడే ఉద్యోగాలు, పనులు దొరుకుతాయని చెప్పారు.
వీటిపై ఆలోచన చేశామని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇటు వైపు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టాల్సి ఉన్నదని, ఈ దఫా యుద్ధ ప్రాతిపదికన కడుతామని, ఇల్లు లేని మ నిషి లేకుండా చేద్దామని చెప్పారు. డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి పథకాల కింద వచ్చే ఐదేండ్లలో నిర్మాణం ముమ్మురంగా చేపడుతామని, తెలంగాణలో వడ్లు ఎట్లా పండుతున్నాయో..? ఇండ్ల నిర్మాణాలు అట్లనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇండ్ల జాగలు లేని వారికి స్థలాలు ఇస్తామని, సొంత జాగలున్నవారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు. ఆయన మాటల్లోనే.
రైతుల పరిస్థితి బాగుచేయాలని రైతు బంధు, రైతు బీమా పెట్టినం. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నం. మీ ఊళ్లకే వచ్చి కొంటున్నం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి రెండు మూడు వేల కోట్ల నష్టం వచ్చినా.. మేం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ రోజు తెలంగాణలో మూడు కోట్ల టన్నలు వడ్లు పండుతున్నయి. గతంలో మనకు ఎవుసం చేయరాదంటూ హేళన చేసిన్రు. మీరు జొన్నలే పండించుకోవాలి. వడ్లు వండయి అన్నరు. మీరి ఇయాళ మూడు కోట్ల టన్నల వడ్లు వాళ్ల అయ్య పండించిన్రా..? యాడికెళ్లి వచ్చినయి. ఎట్ల మూడుకోట్ల టన్నులు పండుతున్నయి. హెలీక్యాప్టర్లో తిరుగుతుంటే.. డాంబర్ రోడ్లపై వడ్ల కుప్పలే కనిపిస్తున్నయి. కొన్ని ఊళ్లల్లో అయితే రోడ్లే బందు పెట్టి రైతులు వడ్లు ఎండపెడుతున్రు.
ఆటో రిక్షా పిల్లలున్నరు. వాళ్లకు వచ్చే ఆదాయం తక్కువ. నరేంద్ర మోదీ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచిండు. ఇండియా మొత్తంలో కూడా ఆటో రిక్షా వాళ్ల దగ్గర ముక్కు పిండి పన్ను వసూళ్లు చేస్తున్రు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఆ పన్ను రద్దు చేసిన. ఇప్పుడు వాళ్లకు రాష్ట్రంలో రూపాయ పన్ను కూడా లేదు. కానీ, వాళ్లకు ఇంకో బాధ ఉంది. అదేమిటంటే.. ఏడాదికోసారి ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలి. ఫిట్నెస్ పరీక్ష చేయడానికి 700 చార్జీలను వసూలు చేస్తున్రు. సర్టిఫికెట్ ఇవ్వడానికి 500 వసూలు చేస్తున్రు. మొత్తం 1200 బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు జేస్తం. కరీంనగర్కు నాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నడు. ‘మీకు కరీంనగర్కు ఏదో లింకుంది. ఒక వైబ్రేషన్ ఉంది సర్ అన్నడు. లింకు అంటే ఉందనుకో.. నేను ఈడనే పెళ్లి చేసుకున్న. కరీంనగర్ అమ్మాయినే చేసుకున్న. నిజంగా గూడ నేను కరీంనగర్ వచ్చినప్పుడళ్లా ఓ స్కీం ప్రకటిస్తున్న. అందులో భాగంగానే వాళ్లకు ఇవ్వాళ శుభవార్త చెబుతున్న. ఫిట్నెస్ కోసం చెల్లిస్తున్న 1200 రద్దు చేస్తున్న. ఇక నుంచి వాళ్లకు ఆ బాధనే ఉండదు.
బీజేపీ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్తే నేను సచ్చినా.. పెట్టా అని చెప్పిన. అట్లయితే.. మీకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటులో కోత పెడుతమన్నరు. పెట్టుకోమని చెప్పిన. ఏటా 5వేల కోట్ల చొప్పున గత ఐదేండల్లో 25వేల కోట్లు మోడీ ముంచిండు. మోడీ దేశంలో 150 మెడికల్ కళాశాలు పెట్టిండు. మనకు ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వాలని వంద ఉత్తరాలు రాసినం. అయినా ఇవ్వలే. నవోదయ విద్యాలయాలకు సంబంధించి పార్లమెంట్లో పాసైన చట్టం ఉంది. దాని ప్రకారం ఎన్ని జిల్లాలుంటే ఆ జిల్లాలకు నవోదయ పాఠశాలలు కేంద్రం మంజూరు చేయాలి. ఆ చట్టం ప్రకారం మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినం. ఉత్తరాలు రాసినం.
మన ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించిన్రు. అయినా ఒక్కటీ ఇవ్వలే. ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. అటువంటి బీజేపీ సిగ్గు లేక ఎట్లా ఓట్ల కోసం వస్తున్నది. ఏ మొఖం పెట్టుకొని అడుగుతున్నది? మీటర్లు పెట్టలేదని మనకు శిక్ష వేసి.. రూ.25 వేల కోట్ల గ్రాంటు కోతలు పెట్టడంతోపాటు మనకు ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా ఉన్న బీజేపీకి ఒక్క ఓటు కూడా మనమెందుకు వేయాలి. మీరు ఈ అంశంపై చర్చించాలి. ప్రస్తుతం బీజేపీకి ఓటు వేస్తే అది మోరీలో వేసినట్లు అవుతుంది. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్న. బీజేపీకి ఓటు వేయకుండా రసమయికి వేయాలి. ప్రజలకు మీరు కూడా దండం పెట్టి చెప్పాలని కోరుతున్న. బీజేపీకి వేయడం కన్నా.. రసమయికి వేస్తే బ్రహ్మాండగా అభివృద్ధి జరుగుతుందని చెప్పండి.
చెప్పిన ప్రతి పనినీ చేసి చూపించినం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
తెలంగాణ రాక ముందు మన పరిస్థితి ఎట్లున్నదో.. ఇపుడు ఎట్లున్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. మానకొండూర్ నియోజకవర్గ ఆశీర్వాద సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులను వివరించారు. అప్పట్లో కరెంట్, సాగునీటి కోసం పడిన గోసను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకోగలిగామని చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని అన్నారు. తెలంగాణ తెస్తామని చెప్పి తెచ్చి చూపించామని, 24 గంటల కరెంట్ ఇస్తమని, ఇచ్చి చూపించామన్నారు. గోదావరి, కృష్ణ నదుల నుంచి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పి, అందిస్తున్నామని అన్నారు. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉన్నదని, ఈ సారి మంచి మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపిస్తే రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశముంటుందని అన్నారు. మానకొండూర్ నుంచి రసమయి బాలకిషన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వినోద్కుమార్ కోరారు.
అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపా బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హుజూరాబాద్ మాదిరిగా ఎస్సీ నియోజకవర్గమైన మానకొండూర్లో కూడా దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. ఆయనదైన కళాహృదయం నుంచి వచ్చిన ‘కనకనమని మండుతున్న కనకదప్పు కడుపు.. గాలిలోన ఆడుతున్న గజ్జెలు ఈ కాళ్లు.. వేణువై ఎగసిపడే రాగము ఈ గొంతు.. ప్రేమతో మీరందించే చప్పట్లే దరువు’ అనే పాటతో రసమయి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గతానికి ఇప్పటికి వచ్చిన మార్పు గురించి వివరించారు. జనం చప్పట్లనే దరువుగా చేసుకొని ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో మహనీయుడైన ఉద్యమ నేత కేసీఆర్ అడుగు జాడల్లో పధ్నాలుగేండ్లు నడిచి ఆయన గొంతుకు ఆటనై.. పాటనై సాగానని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత తనను ఈ స్థాయికి తెచ్చింది కేసీఆరే అని కొనియాడారు.
మానకొండూర్ నియోజకవర్గానికి అడగకముందే అన్నీ ఇచ్చారని, అవసరాన్ని గుర్తించి ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశారని, మానకొండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపారని చెప్పారు. ఒకప్పుడు మానకొండూర్లో ఉన్న పరిస్థితులు అందరికి తెలుసని, ‘తలాపున పారుతోంది గోదారి.. మా చేను మా చెలుకా ఎడారి’ అని కన్నీటి పాటలు కైకట్టుకొని పాడిన సందర్భాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ఇపుడు మిడ్మానేరు, అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్, తోటపల్లి రిజర్వాయర్, రంగనాయక రిజర్వాయర్లు కట్టించి వాటి ద్వారా ఇదే నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరందించిన అపర భగీరథుడు కేసీఆర్ అన్నారు. ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో తాను ఉన్నానని అన్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలోని బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట, కేశవపట్నం, తిమ్మాపూర్తోపాటు మానకొండూర్ ఎగువ ప్రాంతమంతా పత్తి చేన్లు వేసుకునేవారని, అప్పుడు వానలు రాకపోతే ఎండిన చేన్లను చూసి పత్తి పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయేవన్నారు.
అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితిని చూశామని, ఇపుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇదే మానకొండూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందించడం ద్వారా రైతన్నలు చాలా సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అడుగకపోయినా మానకొండూర్, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో 50 పడకల దవాఖానలు ఇచ్చారని అన్నారు. వాస్తవానికి తనకు పాటలు పాడడం తప్పా పని చేయడం ఎక్కువ రాకుండేదని, కానీ, తెలంగాణ కోసం కేసీఆర్ తీసుకున్న అకుంఠిత దీక్షను, అందుకోసం ఆయన గడిపిన నిద్ర లేని రాత్రులను చూసిన తర్వాత పనులు ఎట్లా చేయాలో నేర్చుకున్నానని అన్నారు.
ఆ పని విధానంపై నమ్మకం కలిగిన మానకొండూర్ ప్రజలు తనను ఇప్పటికీ రెండు సార్లు అఖండ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. అందుకు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఇప్పుడు మరోసారి తనను గెలిపించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని రసమయి కోరారు. హైదరాబాద్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ఆలోచన విధానాలను ఆకాశమంత ఎత్తుకు చేర్చిన మహానేత సీఎం కేసీఆర్ అని అన్నారు. అంతే కాకుండా సచివాలయానికి అంబేద్కర్ పేరు పేరుపెట్టి దళితులను సముచితంగా గౌరవించిన నాయకుడు ఆయనేని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే కృతనిశ్చయంతో దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు తెచ్చిన దళిత జనోద్ధారకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మానకొండూర్ నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం కేసీఆర్కు బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.