Mulkanoor | చిగురుమామిడి, సెప్టెంబర్ 18 : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతగా గుర్తించాలని సర్పంచ్ సాంబారి భారతమ్మ-కొమురయ్య అన్నారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత పారిశుధ్యం, చెత్త నిర్వహణపై స్వచ్ఛతాహి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం బాధ్యతగా స్వీకరించాలని అన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరి బాధ్యతగా విద్యార్థులు గుర్తించాలన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం, మన గ్రామం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో గ్రామస్తులందరూ భాగస్వాగతం కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, వార్డు సభ్యులు గట్టు రేణుక, వంగాల రాము, పందిపెళ్లి కీర్తన, ఎండీ రజాక్, మర్రి విజయలక్ష్మి, జట్టిలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.