పెద్దపల్లి, మార్చి 30(నమస్తే తెలంగాణ): దిగువ మానేరు జలాశయం నుంచి గోదావరిలో కలిసే మంథని మండలం ఆరెంద వరకు మానేరు వాగు 108 కిలో మీటర్లు ఉండగా పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 86 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. అయితే, ఈ వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుండగా, ఎండకాలం వచ్చిందంటే చుక్క నీరు నిలువ లేక ఎడారిని తలపించేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్ల భారీ వ్యయంతో 16 చెక్ డ్యాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి వద్ద మొదటి చెక్డ్యాం నిర్మిస్తుండగా ఒక్కో చెక్ డ్యాం మధ్య 2 నుంచి 6 కిలో మీటర్ల దూరం నిడివితో గోదావరినదిలో కలిసే వరకు 16 నిర్మిస్తున్నది. వీటితో పెద్దపల్లి జిల్లాతో పాటు సరిహద్దు కరీంనగర్, జయశంకర్భూపాలపల్లి జిల్లాలకూ ప్రయోజనం చేకూరుతున్నది. ఇరిగేషన్ డివిజన్-4 మంథని పర్యవేక్షణలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 5 చెక్ డ్యాముల పనులు దాదాపు పూర్తి కావస్తుండగా, వీటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. చెక్డ్యాంలు పూర్తయిన ప్రాంతాల్లో రెండు వైపులా ఉన్న గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు సైతం పైకి వచ్చాయి. దీంతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
95 శాతం పూర్తైన చెక్డ్యాములు ఇవే..
జిల్లాలో మానేరుపై 16 చెక్ డ్యాముల నిర్మాణాన్ని ప్రారంభించగా 5 చెక్ డ్యాముల పనులు 95 శాతం పూర్తయ్యాయి. నీరుకుల్ల, గొల్లపల్లి, కదంబాపూర్, మంచిరామి, కనగర్తి చెక్డ్యాముల పనులు 95 శాతం పూర్తికావడంతో చెక్ డ్యాంల బ్యాక్ ఏరియాల్లో ఇప్పటికే నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఒక్కో చెక్ డ్యామ్కు అరకిలో మీటర్ మేర నీళ్లు నిలిచి ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేసవి ఆరంభంలోనే చుక్క నీరు లేకుండా ఎడారిగా మారిపోయే మానేరు కాస్తా చెక్డ్యాముల వద్ద నిలిచిన నీటితో జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో చెక్డ్యాంకు ఇరువైపులా ఉన్న రైతులు పుష్కలమైన పంటలు పండిస్తున్నారు. దీనికి తోడు చెక్ డ్యాముల వద్ద నిలిచిన నీళ్లల్లో మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు.
జూన్లోగా నిర్మాణాలు పూర్తి చేస్తాం
జిల్లాలోని 16 చెక్డ్యాంలకు సంబంధించిన పనులను వచ్చే జూన్లోగా పూర్తి చేస్తాం. ఇప్పటికే ఐదు చెక్ డ్యాంలకు సంబంధించి 95 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 6 వరకు 75 శాతం పూర్తయ్యాయి. జూన్ నెల చివరి కల్లా అన్ని చెక్ డ్యాముల పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. కొన్ని చోట్ల చెక్ డ్యాముల వద్ద నీళ్లున్నాయి. కొంత నీరు తగ్గగానే పూర్తి స్థాయి పనులు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే 95శాతం పనులైన చెక్ డ్యాంల దగ్గరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడంతో పాటు మానేరులో నీరు ఎప్పటికీ ఉంటుంది.
– కంభంపాటి బలరామయ్య, ఇరిగేషన్ ఈఈ; మంథని
తలాపున గోదారి ఉన్నట్లున్నది
నాకు రెండెకరాల పొలం ఉంది. మునుపు ఈ మానేరు వానకాలం తప్ప మిగతా రోజులన్నీ ఎండిపోయి ఎడారిగా ఉండేది. సాగు నీటికి చానా తిప్పలయ్యేది. పంట ఏసుకుందామంటే భరోసా ఉండకపోయేది. నేను నా భార్య శానా బాధ పడేది. సాగు కాక కన్నీళ్లు పెట్టుకునేది. కానీ, ఈ చెక్ డ్యాం కట్టినంక మాకు మంచి భరోసా ఇచ్చినట్టయ్యింది. తలాపున గోదావరి ఉన్నట్టున్నది. నీళ్లను జూత్తె శానా సంబురమైతంది. గిట్ల ఎన్నడూ ఇక్కడ నీళ్లు ఉండకపోయేది.
-ఓదెలు, రైతు నీరుకుల్ల సుల్తానాబాద్ మండలం
నాకు నెలకు ఐదారు వేలు అత్తన్నై
మాది కోమల్లపల్లి. మేం మత్స్యకారులం. అయితే, మాకు మానేరు పక్కనే ఉన్నా చేపలు పట్టడం మాత్రం ఉండేది కాదు. వానకాలమైతే వాగు ఎక్కువ పారి చేపలు పట్టడానికి వీలుండకపోయేది. ఎండిన తర్వాత గుంతల్లో నాలుగైదు రోజులు పట్టేవాళ్లం. చేపలతో పెద్దగా ఉపాధి ఉండేది కాదు. కానీ, చెక్ డ్యాం నిర్మించిన తర్వాత అరకిలో మీటర్ వరకు బ్యాక్ వాటర్ ఉంటున్నై. అందులో రోజూ తెప్పలు ఏసుకుని చేపలు పడుతున్నం. ప్రతీ రోజూ పట్టడం వల్ల నెలకు ఐదారు వేలు అత్తన్నై. చెక్ డ్యాంతోటి మాకు అదనపు సంపాదన వచ్చినట్లయ్యింది. రోజూ తీరొక్క చేపలు పడుతున్నయ్.
-ఐలవేన నర్సయ్య, మత్స్యకారుడు, కోమల్లపల్లి, సుల్తానాబాద్ మండలం
ఇల్లు గడుస్తంది..
మాది కోమల్లపల్లి. మేం ప్రతీ రోజూ నీరుకుల్ల చెక్డ్యాంల చేపలు పడుతున్నం. రాహు, బొచ్చె, జెల్ల, బిల్లలు, పూబొమ్మెలు, వాలుగు చేపలు పడుతున్నయ్. రోజూ 10-15 కిలోలు పడుతున్నై. రోజూ వెయ్యి దాకా అత్తున్నై. వాటితోటి కుటుంబాన్ని పోషించుకుంటున్న. చెక్ డ్యాం వచ్చినంక మాకు ఉపాధి దొరికింది. ఇక్కడ మేం దాదాపు 30 మంది వరకు వచ్చి చేపలు పట్టుకుంటున్నం. ఇక్కడికే వ్యాను వచ్చి మా అదరి దగ్గర చేపలు కొనుక్కొని పెద్దపల్లి మార్కెట్కు వెళుతున్నది.
-ఐలవేని కొమురయ్య, మత్స్యకారుడు, కోమల్లపల్లి, సుల్తానాబాద్ మండలం
ఎప్పుడూ నీళ్లే..
మాది కనుకుల. ఇక్కడ చెక్ డ్యాం కట్టినంక. ఎప్పుడూ నీళ్లు ఉంటున్నై. ఇక్కడ బాగా చేపలు పడుతున్నై. ఖాళీగా ఉన్నప్పుడల్లా గాలాలు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటం. కూరమందం పట్టుకొని ఇంటికి పోతం. ఇలా వారానికోసారి వచ్చి పట్టుకుంటన్నం.
-కొమ్మిడి శ్రీనివాస్, కనుకుల