Chandurthi | చందుర్తి, మే19: చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి ఎదురుగా సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధికి తాము అడ్డు కాదని, గ్రామపంచాయతీ తీర్మానం చేసిన స్థలంలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని గుర్తు చేశారు.
20 వేల మంది వృద్ధుల ఆత్మగౌరవానికి ప్రతీక చార్వాక పౌండేషన్ అన్నారు. వృద్ధుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సబ్ స్టేషన్ నిర్మాణాన్ని మార్చాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పునః పరిశీలించి సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కోరారు. ఇక్కడ వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.